Priyanka Gandhi | పంజాబ్లో ప్రధాని భద్రతా విషయంలో తలెత్తిన లోపంపై తానే పంజాబ్ సీఎం చన్నీతో తానే మాట్లాడానని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వెల్లడించారు. తానెలాంటి రాజ్యాంగబద్ధ పదవిలో లేనని, అయితే ప్రధాని భద్రతకు సంబంధించి టీవీల్లో వస్తున్న ఘటనను చూసి, కాస్త ఆందోళనకు గురయ్యానని అన్నారు. అందుకే ఈ ఘటనకు సంబంధించి సీఎంను అడిగి తెలుసుకున్నా. ఓ కొలీగ్లాగానే సీఎం చన్నీకి ఫోన్ చేసి, వివరాలు తెలుసుకున్నానని ప్రియాంక స్పష్టం చేశారు. ‘నేనే స్వయంగా పంజాబ్ సీఎం చెన్నీతో మాట్లాడా. నేను ఏ రాజ్యాంగబద్ధ పదవిలోనూ లేను. అయితే ప్రధాని భద్రతకు సంబంధించి టీవీ చానళ్లలో వస్తున్న వార్తలను చూసి ఆందోళన చెందా. అందుకే ఈ సీఎం చెన్నీకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నా. ఓ విషయాన్ని ఎవ్వరూ మరిచిపోవద్దు.. ప్రధాని మోదీ ఈ దేశ ప్రధాని’ అని ప్రియాంక అన్నారు.
తమ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో తాను ఫోన్లో మాట్లాడానని పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ చెన్నీ వెల్లడించారు. ప్రధాని మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా తలెత్తిన వివాదం, అసలు ఏం జరిగింది.. వీటిపై కూలంకషంగా ఆమెకు వివరించానని, ప్రధాని మోదీ భద్రతకు ఎలాంటి ఢోకా కూడా లేదని ప్రియాంకతో చెప్పినట్లు సీఎం చెన్నీ వెల్లడించారు. బీజేపీ సరిగ్గా ఇదే పాయింట్ను లేవదీసింది. ప్రధాని మోదీ భద్రతకు సంబంధించి సీఎం చెన్నీ పార్టీ నేత ప్రియాంకకు చెప్పాల్సిన అవసరం ఏముంది? అంటూ ట్విట్టర్ వేదికగా బీజేపీ నేత సంబిత్ పాత్రా ప్రశ్నించారు. ఆమె ఎలాంటి రాజ్యాంగబద్ధమైన పదవిలో లేరని, అయినా ఎందుకు చెప్పాల్సి వచ్చిందని సంబిత్ పాత్రా సూటిగా నిలదీశారు.