బెంగళూరు, సెప్టెంబర్ 10: బెంగళూరులో ప్రైవేట్ వాహనాల ఆపరేటర్లు సోమవారం బంద్ చేపట్టనున్నారు. కర్ణాటక ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న శక్తి పథకాన్ని కేవలం ప్రభుత్వ రవాణా బస్సులకు మాత్రమే కాకుండా ప్రైవేటు బస్సులకు కూడా విస్తరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే బైక్ ట్యాక్సీల సేవలను నిషేధించాలని కోరుతున్నారు. సోమవారం బంద్ చేపట్టనుండటంతో లక్షలాది ప్రైవేట్ వాహనాల సేవలు నిలిచిపోనున్నాయి.
ఆటోలు, ట్యాక్సీలు, మ్యాక్సీ క్యాబ్లు, ప్రైవేటు బస్సులు అందుబాటులో ఉండవు. దీంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పేలా లేవు. కర్ణాటక రాష్ట్ర ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ల ఫెడరేషన్ అధ్యక్షుడు ఎస్ నటరాజ శర్మ తెలిపిన వివరాల ప్రకారం, ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం అర్ధరాత్రి వరకు బెంగళూరు నగరంలో ప్రైవేటు వాహనాలు ప్రజలకు అందుబాటులో ఉండవు. బంద్ నేపథ్యంలో బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్.. బస్సుల ట్రిప్పులను పెంచాలని నిర్ణయించింది. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా బస్సు సేవలను పెంచాలని నిర్ణయించింది. అదేవిధంగా కొన్ని పాఠశాలల యాజమాన్యాలు సోమవారం సెలవు ప్రకటించాయి. రవాణా సదుపాయాలు లేకపోవడం వల్ల విద్యార్థులకు కలిగే అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాయి.