Manipur Violence | న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ నిరవధిక మౌనం మణిపూర్లో ఘోరాతి ఘోర దారుణాలకు దారితీసింది. మూడు నెలలుగా కొనసాగుతున్న జాతుల ఘర్షణలో చోటుచేసుకొన్న అమానవీయ ఘటనలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వ చేతగానితనం, కేంద్రప్రభుత్వ అలసత్వం అక్కడి సమాజంలో ఎంతటి విపత్తులకు దారితీసిందో ఇప్పుడు బయటకు వచ్చిన వీడియోలు స్పష్టం చేస్తున్నాయి. మే 4న ఓ గ్రామంలో కుకీ తెగకు చెందిన ముగ్గురు మహిళలను నగ్నంగా ఊరేగించి సామూహిక లైంగికదాడికి పాల్పడిన దృశ్యాలు దేశాన్ని కుదిపేస్తున్నాయి.
పోలీసుల వద్ద ఉన్న బాధితులను దాదాపు వెయ్యిమంది మైతీలు బలవంతంగా లాక్కెళ్లి నగ్నంగా మార్చి ఊరేగించిన దృశ్యాలను చూసి 140 కోట్ల మంది భారతీయులు చలించిపోతున్నారు. దేశ ఆగ్రహాన్ని గమనించిన ప్రధాని నరేంద్రమోదీ ఎట్టకేలకు మౌనం వీడి బాధితులకు సానుభూతి తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని ప్రకటన చేసి చేతులు దులుపుకొన్నారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన సుప్రీంకోర్టు, వీడియోను సుమోటోగా స్వీకరించి విచారణ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ఉలిక్కిపడిన మణిపూర్ పోలీసులు హడావిడిగా ఇద్దర్ని అరెస్టు చేసినట్టు ప్రకటించారు. మణిపూర్ సీఎం బీరేన్సింగ్, ఇలాంటి ఘటనలు వందలకొద్దీ చోటుచేసుకొన్నాయని నిస్సిగ్గుగా అంగీకరించారు.
మణిపూర్లో మెజారిటీ వర్గమైన మైతీలను గిరిజనుల్లో చేర్చే అంశాన్ని పరిశీలించాలని ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇవ్వటంతో మే 3న ఒక్కసారిగా జాతుల ఘర్షణ తలెత్తిన విషయం తెలిసిందే. హిందువులైన మెజారిటీ మైతీలకు, గిరిజనులైన మైనారిటీ కుకీ, నాగా మరికొన్ని జాతులకు మధ్య భీకర ఘర్షణలు చెలరేగాయి. అప్పటి నుంచి ఈ గిరిజనులకు చెందిన చర్చిలను కూల్చేయటం, గ్రామాలను తగులబెట్టడం సర్వసాధారణం అయిపోయింది. మైతీ వర్గంలోని కొందరు భద్రతా బలగాల వద్ద ఆయుధాలను దొంగిలించి మారణహోమానికి పాల్పడుతున్నారు. ఇందులో భాగంగా మే 4న దాదాపు వెయ్యిమంది మైతీలు కాంగ్పోక్పీ జిల్లాలోని బీ ఫైనోమ్ గ్రామంపై దాడిచేశారు. ఇండ్లన్నింటినీ తగులబెట్టారు. భయంతో పారిపోతున్న కుకీలను పట్టుకొని కొట్టి చంపేశారు.
ఈ మారణకాండకు భయపడి ఓ కుటుంబం అడవిలోకి పారిపోయింది. వారిని పోలీసులు రక్షించి స్టేషన్కు తీసుకెళ్తుండగా ఆ అల్లరిమూక అడ్డగించింది. ముగ్గరు మహిళలను, ఇద్దరు పురుషులను బలవంతంగా పోలీసుల నుంచి లాక్కెళ్లింది. మహిళల్లో 20 ఏండ్ల యువతితోపాటు 40, 50 ఏండ్లున్న మరో ఇద్దరు ఉన్నారు. వీరిని నగ్నంగా మార్చి ఊరేగించారు. యువతిపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అడ్డుకోబోయిన ఆ యువతి తండ్రితోపాటు సోదరున్ని చంపేశారు. పోలీసుల కండ్లెదుటే జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై మే 18న ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ దారుణానికి పాల్పడినవాళ్లంతా మైతీ లీపున్, కాంగ్లీపాక్ కంబలూప్, అరంబై తెంగోల్, వరల్డ్ మైతీ కౌన్సిల్, షెడ్యూల్డ్ ట్రైబ్ డిమాండ్ కమిటీ తదితర మైతీ సంఘాలకు చెందినవారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. దాదాపు 70 రోజులైనా బాధ్యులను పోలీసులు అరెస్టు చేయలేదు. తాజాగా వీడియో వైరల్ కావటంతో ఇద్దరిని అరెస్టు చేశారు.
జాతుల ఘర్షణలతో మణిపూర్లో వందల గ్రామాలు నామరూపాల్లేకుండా పోయాయి. వందలకొద్ది చర్చిలను దుండగులు నేలమట్టం చేశారు. వేల ఇండ్లు బూడిదయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారమే 140 మంది చనిపోయారు. 50 వేలమంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకొంటున్నారు. పోలీసులు అక్కడే ఉన్నా కాపాడలేదు: బాధితులు తమపై దారుణం జరుగుతున్నప్పుడు పోలీసులు అక్కడే ఉన్నారని, కానీ కాపాడలేదని బాధిత మహిళల్లో ఒకరు వాపోయారు. నలుగురు పోలీసులు కారులో కూర్చొని హింసను చూస్తూ ఉండిపోయారని తెలిపారు.
మహిళల నగ్న ఊరేగింపుపై మణిపూర్ సీఎం బీరేన్సింగ్ షాకింగ్ ప్రకటన చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో గత రెండు నెలల్లో ఇలాంటి ఘటనలు వందలకొద్దీ జరిగాయని ప్రకటించారు. ‘మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనలు వందలకొద్ది చోటుచేసుకొన్నాయి. ఇంటర్నెట్ను నిరవధికంగా నిలిపివేయటమే దీనికి కారణం’ అని అర్థంపర్థం లేకుండా మాట్లాడారు. బీఫైనోమ్ ఘటన రాష్ట్ర సీఎంకు తెలియలేదా? అని ప్రశ్నించగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అని చెప్పి తప్పించుకొన్నారు.
మణిపూర్ హింసపై ప్రధాని నరేంద్రమోదీ ఎట్టకేలకు నోరు విప్పారు. మహిళలపై జరిగిన దాడిని ఖండిస్తున్నానని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొంటామని గురువారం మీడియాతో చెప్పారు. మోదీ ప్రకటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మణిపూర్లో హింసకు మోదీ మౌనమే కారణమని సామాన్యులు దుమ్మెత్తిపోస్తున్నారు. 1800 గంటల మౌనం తర్వాత 30 సెకండ్లు మాట్లాడి సానుభూతి తెలుపుతారా అంటూ ఏకిపారేస్తున్నారు. రాష్ట్రంలో హింసపై మొదటినుంచీ కేంద్రం అలసత్వం ప్రదర్శిస్తున్నదనే ఆరోపణలు ఉన్నాయి. హింస ప్రారంభమైన నెల తర్వాతగానీ కేంద్ర హోంమంత్రి ఆ రాష్ట్రంలో పర్యటించలేదు. జాతుల ఘర్షణ మొదలైన మొదటి పది రోజుల్లోనే రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం చేతులెత్తేసింది. అయినా, కేంద్రం వెంటనే స్పందించలేదు. మైతీ అతివాదులు భద్రతాబలగాల వద్ద వందలకొద్దీ ఆయుధాలను దొంగిలించి ప్రత్యర్థులపై భీకర దాడులు మొదలుపెట్టినా పట్టించుకోలేదు. రాష్ట్ర సీఎం బీరేన్సింగ్ అయితే.. మయన్మార్ నుంచి అక్రమంగా వచ్చిన కుకీ ఉగ్రవాదులే ఈ హింసకు కారణమని ప్రకటన చేసి పరిస్థితిని మరింత దిగజార్చారు.