PM Modi | జైపూర్, ఏప్రిల్ 21: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్పై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే, ప్రజల ఆస్తులు, భూమి, బంగారాన్ని ముస్లింలకు పంచేస్తుందని వ్యాఖ్యానించారు. ఆదివారం రాజస్థాన్లోని జాలోర్లో ఆయన ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ… ‘ఇంతకుముందు వాళ్లు(కాంగ్రెస్) అధికారంలో ఉన్నప్పుడు దేశ సంపదలో మొదటి హక్కు ముస్లింలకే అని చెప్పారు. అంటే ఈ సంపద మొత్తాన్ని వారు ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి, చొరబాటుదారులకు పంచేస్తారు.
మీ కష్టార్జితాన్ని చొరబాటుదారులకు పంచేందుకు మీరు అంగీకరిస్తారా?’ అని ప్రశ్నించారు. ‘తల్లులు, చెల్లెళ్ల దగ్గర ఉన్న బంగారం లెక్క తీస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టో చెప్తున్నది. ఈ సంపదను పంచేస్తారు. సంపదపై ముస్లింలకే మొదటి హక్కు ఉంటుందని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చెప్పింది. ఈ అర్బన్ నక్సల్స్ ఆలోచన నా తల్లులు, చెల్లెళ్ల మంగళసూత్రాలను కూడా వదలదు’ అని మోదీ పేర్కొన్నారు. మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ తప్పుబట్టింది. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో హిందూ, ముస్లిం అనే పదాలనే పొందుపర్చలేదని ఆ పార్టీ నేత పవన్ ఖేరా పేర్కొన్నారు.