PM Modi | న్యూఢిల్లీ, నవంబర్ 26: భారత్లోని ఉన్నత కుటుంబాలు విదేశాల్లో పెండ్లి వేడుకలు నిర్వహించుకోవటాన్ని ప్రధాని మోదీ తప్పుబట్టారు. వివాహ వేడుకలు, కొనుగోళ్లను దేశీయంగా చేపట్టడం ద్వారా ‘వోకల్ ఫర్ లోకల్’ మద్దతు ఇచ్చినట్టవుతుందని ఉన్నత కుటుంబాలకు సూచించారు. ‘మన్ కీ బాత్’ సందర్భంగా ఆదివారం ప్రజల్ని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘మన దేశంలో పెండ్లీల సీజన్లో సుమారుగా రూ.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. పెండ్లి సమయంలో జరిపే కొనుగోళ్లు, వివాహ వేడుక నిర్వహణ దేశీయంగా జరుపుకోవాలని ఉన్నత కుటుంబాలకు విజ్ఞప్తి చేస్తున్నా.
షాపింగ్ సమయంలో భారత ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నా’ అని ప్రధాని అన్నారు. విదేశాలకు వెళ్లి వివాహ తంతు జరుపుకోవాల్సిన అవసరమేముందని అన్నారు. యూపీఐ, డిజిటల్ లావాదేవీలతో నగదు చెల్లింపులు జరపాలని దేశ ప్రజల్ని కోరారు. సరిగ్గా 15 ఏండ్ల క్రితం ఇదే రోజున భారత్ అత్యంత హేయమైన ఉగ్రదాడిని ఎదుర్కొన్నదని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఆ దాడి నుంచి కోలుకొని, ఉగ్రవాదాన్ని ధైర్యంగా అణచివేయడం భారత్ సామర్థ్యానికి నిదర్శనమన్నారు.