జూలై 24తో ముగియనున్న కోవింద్ పదవీకాలం
హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రపతి ఎన్నికకు ఏ క్షణమైనా ప్రకటన వెలువడే అవకాశం ఉన్నది. ప్రస్తుత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పదవీకాలం వచ్చే నెల 24వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో ఆలోగా 16వ రాష్ట్రపతి ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనున్నది. కాగా, రాష్ట్రపతి ఎన్నికకు పార్టీలు తమ ఎంపీలు, ఎమ్మెల్యేలకు విప్ ఇవ్వకూడదు. ఓటేయడానికి, గైర్హాజరుకు ప్రజాప్రతినిధులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.
ఓటింగ్ బ్యాలెట్ పేపర్ ప్రకారం జరుగుతుంది. ఓటింగ్ వేసేందుకు అవసరమైన పెన్నును కేంద్ర ఎన్నికల సంఘమే ఇస్తుంది. ఆ పెన్నుతోనే ఓటేయాల్సి ఉంటుంది. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ఎలక్టోరల్ కాలేజీ మొత్తం ఓట్ల విలువ 10,81,683 కాగా, ప్రస్తుతం ఎన్డీయేకి 5,30,690 (49 శాతం) ఓట్లు ఉండగా, యూపీఏకు 2,56,756 (24.02 శాతం) ఓట్లు ఉన్నాయి. ఇతర పార్టీలకు 2,94,395 (26.98 శాతం) ఓట్ల బలం ఉన్నది. ఇదిలా ఉండగా, రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి నుంచి బాధ్యతలు చేపట్టిన రాష్ట్రపతులంతా జూలై 25నే ప్రమాణ స్వీకారం చేయటం గమనార్హం.