న్యూఢిల్లీ: ఢిల్లీలో కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని(New Parliament Building) ఈనెల 28వ తేదీన ప్రధాని మోదీ ప్రారంభించనున్న విషయం తెలిసిందే. అయితే కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ముర్ము చేత ఓపెనింగ్ చేసేలా లోక్సభ సెక్రటేరియేట్, కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో ఇవాళ పిల్ దాఖలైంది. సుప్రీంకోర్టు లాయర్ సీఆర్ జయ సుకిన్ ఈ పిటిషన్ ఫైల్ చేశారు. కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ సెర్మనీలో రాష్ట్రపతి పేరును చేర్చలేదని, కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లు ఆ పిల్లో పేర్కొన్నారు.
పార్లమెంట్ అనేది సుప్రీం లెజిస్టేటివ్ సంస్థ అని, పార్లమెంట్లో రాష్ట్రపతి, ఉభయసభలు కూడా ఉంటాయని పిటీషన్లో తెలిపారు. ఉభయసభలకు సమన్లు జారీ చేసే, ప్రొరోగ్ చేసే అధికారం రాష్ట్రపతికి ఉందని ఆ పిల్లో చెప్పారు. రాష్ట్రపతిని ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవడం అసంబద్ధంగా ఉందన్నారు.