న్యూఢిల్లీ, జనవరి 31: రాబోయే పాతికేండ్లు భారత్కు ఎంతో కీలకమని, 2047 కల్లా దేశాన్ని ఆత్మనిర్భర్ భారత్గా తీర్చిదిద్దాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. భారత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను మంగళవారం ప్రారంభించిన ముర్ము.. సెంట్రల్ హాల్లో ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంయుక్త సభల సమావేశంలో ఆమె ప్రసంగించడం ఇదే తొలిసారి.
ప్రపంచానికి పరిష్కారం చూపే దిశగా భారత్ పయనిస్తున్నదని రాష్ట్రపతి కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం నిర్భయంగా పనిచేస్తున్నదని పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు వంటి సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకొన్నదని తెలిపారు. దేశానికి అవినీతి అతిపెద్ద శత్రువని, దీన్ని అంతమొందించడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని వెల్లడించారు.
రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు
బడ్జెట్ వైపు ప్రపంచం చూపు: మోదీ
ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నదని, ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ భారత్ బడ్జెట్ వైపు చూస్తున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాట్లాడిన ఆయన.. విశ్వసనీయ వర్గాల నుంచి తనకు సానుకూల సందేశాలు అందాయని, ఇది కొత్త ఉత్సాహాన్నిస్తున్నదని పేర్కొన్నారు.
‘బీజేపీ మ్యానిఫెస్టోలా రాష్ట్రపతి ప్రసంగం’
రాష్ట్రపతి ముర్ము ప్రసంగాన్ని విపక్షాలు తప్పుపట్టాయి. అది అధికార బీజేపీ 2024 ఎన్నికల మ్యానిఫెస్టోలా ఉన్నదని విమర్శించాయి. ధరల నియంత్రణ, మత సామరస్యం, మహిళల సమస్య వంటి కీలకాంశాలేవీ ముర్ము ప్రసంగంలో లేవని ఆరోపించాయి. స్థిరమైన, నిర్భయమైన, నిర్ణయాత్మకమైన ప్రభుత్వం కేంద్రం లో ఉన్నదని చెప్తూ ప్రజాస్వామ్యానికీ, సామాజిక న్యాయానికీ అతిపెద్ద శత్రువైన అవినీతి అంతానికి ప్రభుత్వం అవిశ్రాంత యుద్ధం చేస్తున్నది కొనియాడటం చూస్తుంటే ప్రభుత్వ అభిప్రాయాన్ని రాష్ట్రపతి నోటి ద్వారా విన్నట్టు ఉన్నదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు.
నిజంగానే దేశం సర్వతోముఖాభివృద్ధి సాధించిందనుకొంటే దేశంలో ఇంత నిరుద్యోగం ఎందుకున్నట్టు? అని ప్రశ్నించారు. ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగాన్నే రాష్ట్రపతి చదివి వినిపించారని టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ విమర్శించారు. సమాఖ్య స్ఫూర్తిని దృఢపర్చడం, ధరలను అదుపు చేయడం, మహిళా బిల్లు ప్రవేశపెట్టడంపై స్పీచ్లో ఒక్క వాక్యం కూడా లేదని వెల్లడించారు. రాష్ట్రపతి ప్రసంగం యావత్తు అందమైన పదాల అల్లిక తప్ప అందులో ఒక్కటంటే ఒక్క నిజం కూడా లేదని సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వం విమర్శించారు. మహిళలు, యువత, దళితులు, ఆదివాసీల సాధికారత కేవలం కాగితాలకే పరిమితమైందని ట్విట్టర్లో ఆరోపించారు.