న్యూఢిల్లీ, మార్చి 30: దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చరణ్ సింగ్ సహా మరో ఇద్దరికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అందజేశారు. శనివారం రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో దేశ ప్రథమ పౌరురాలు వీటిని అందజేశారు. తెలంగాణ ముద్దు బిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తరపున ఆయన కుమారుడు పీవీ ప్రభాకర్ రావు భారత రత్న పురస్కారాన్ని అందుకున్నారు.
చౌదరీ చరణ్సింగ్ తరఫున ఆయన మనవడు జయంత్ చౌదరి, కర్పూరీ ఠాకూర్ తరఫున ఆయన కుమారుడు శ్రీరామ్నాథ్ ఠాకూర్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ తరఫున ఆయన కుమార్తె నిత్యా రావు భారత రత్నను స్వీకరించారు. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర ప్రముఖులు, అవార్డు గ్రహీతల కుటుంబ సభ్యులు పురస్కారాల ప్రదానోత్సవానికి హాజరయ్యారు. భారత రత్న పొందిన బీజేపీ కురు వృద్ధుడు, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీకి ఆదివారం ఆయన సొంత ఇంట్లో ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
పీవీ సేవలు చిరస్మరణీయం: మోదీ
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ పీవీ నరసింహారావు భారత జాతికి చేసిన సేవలను ప్రతి భారతీయుడు గుర్తుంచుకుంటాడని, ఆయనకు భారతరత్న లభించినందుకు గర్వపడుతున్నానని, మన దేశ అభివృద్ధి, ఆధునికీకరణకు ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. అంతేకాకుండా పీవీ గౌరవనీయ పండితుడు, జ్ఞాని, ఆలోచనా పరుడని, ఆయన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని అన్నారు. అలాగే భారత రత్న వచ్చిన మిగిలిన వారిని ప్రధాని మోదీ ప్రశంసించారు.