న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా పలువురికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సోమవారం పద్మ పురస్కారాలు అందజేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో పద్మ విభూషణ్ పురస్కారాన్ని వెంకయ్య నాయుడు, సులభ్ ఇంటర్నేషన్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ (మరణానంతరం) సంబంధీకులు, ప్రముఖ భరత నాట్య నృత్యకారిణి పద్మా సుబ్రమణ్యం అందుకున్నారు.
నటుడు మిథున్ చక్రవర్తి, గాయని ఉషా ఉతుప్, యూపీ మాజీ గవర్నర్ రామ్ నాయక్, పారిశ్రామికవేత్త సీతారామ్ జిందాల్ పద్మభూషణ్ పురస్కారాన్ని రాష్ట్రపతి నుంచి స్వీకరించారు. తెలంగాణలోని నారాయణపేటకు చెందిన బుర్ర వీణ వాయిద్య కళాకారుడు దాసరి కొండప్ప పద్మశ్రీ అందుకున్నారు. ఈ ఏడాది మొత్తం 132 పద్మ అవార్డులు ప్రకటించగా.. అందులో 5 పద్మవిభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. సోమవారం పలువురికి అవార్డులను ప్రదానం చేయగా, మిగిలిన వారికి వచ్చేవారం అందజేసే అవకాశం ఉన్నది. అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్, ప్రధాని మోదీ తదితరులు హాజరయ్యారు.