లఖీంపూర్ ఖేరి: దేశవ్యాప్తంగా కలకలం రేపిన లఖీంపూర్ ఖేరీ హింసాకాండపై కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తానని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వెల్లడించారు. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీకి చెందిన డిలిగేషన్ రాష్ట్రపతిని కలిసిన సంగతి తెలిసిందే. దీనికి రాహుల్ గాంధీ నేతృత్వం వహించగా ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఏకే ఆంటొనీ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లఖీంపూర్ హింసాకాండపై మెమొరాండంను రాష్ట్రపతికి అందించారు. తమ వాదనలు విన్న తర్వాత ఈ విషయం గురించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతానని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని ప్రియాంక గాంధీ వెల్లడించారు. సాధ్యమైనంత త్వరగా కుదిరితే బుధవారమే ప్రభుత్వంతో ఆయన మాట్లాడతానని చెప్పినట్లు ఆమె తెలిపారు.
కొన్ని రోజుల క్రితం లఖీంపూర్ ఘటనలో మరణించిన మృతుల కుటుంబాలను ప్రియాంక పరామర్శించారు. వారితో మాట్లాడిన అనంతరం బాధిత కుటుంబాలు న్యాయం డిమాండ్ చేస్తున్నాయని చెప్పారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. ఇది పార్టీ డిమాండ్ కాదని, యూపీ ప్రజలు చేస్తున్న డిమాండ్ అని స్పష్టం చెప్పారు.