CEC Appointment Bill | ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. ఈ క్రమంలో శుక్రవారం రాష్ట్రపతి బిల్లులకు ఆమోద్రముద్ర వేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సీఈసీ, ఈసీలను కేంద్ర ప్రభుత్వం సిఫారసు మేరకు రాష్ట్రపతి నియమిస్తున్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సీఈసీ, ఈసీల నియామకం ఇకపై ప్రధానమంత్రి నేతృత్వంలోని ప్యానెల్ పరిధిలోకి రానున్నది. అనగా కార్యనిర్వాహక వర్గమే సీఈసీ, ఈసీలను నియమించనున్నది.
బిల్లు చట్టంగా మారిన నేపథ్యంలో సీఈసీ, ఈసీల నియామకం కోసం కేంద్ర న్యాయశాఖ మంత్రి ఆధ్వర్యంలో సెర్చ్ కమిటీని వేయనున్నారు. ఇందులో ఇద్దరు కేంద్ర కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. సీఈసీ, ఈసీల నియామకం కోసం ఐదుగురి పేర్లతో షార్ట్లిస్ట్ చేసి సెలక్షన్ కమిటీకి పంపిస్తారు. ఆ తర్వాత ప్రధాని నేతృత్వంలోని కేంద్రమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నేతతో కూడిన ప్యానెల్ ఎన్నికల సంఘం సభ్యులను ఎంపిక చేస్తుంది. ఒకవేళ లోక్సభలో ప్రతిపక్ష లేకపోతే ఏకైక అతిపెద్ద పార్టీ నాయకుడిని సెలక్షన్ ప్యానెల్లో సభ్యుడిగా నియమించనున్నారు. సెర్చ్ కమిటీ సూచించిన షార్ట్లిస్ట్లో లేని పేర్లను సైతం పరిగణనలోకి తీసుకొనే అధికారం ప్యానెల్కు ఉంటుంది.