న్యూఢిల్లీ, నవంబర్ 15: ఢిల్లీ వాయు కాలుష్య సమస్యపై అత్యవసర సమావేశం నిర్వహించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. అత్యావశ్యకం కాని నిర్మాణాలు, రవాణా, విద్యుత్తు ప్లాంట్ల నిలిపివేత, వర్క్ ఫ్రం హోం అమలు వంటి చర్యలపై మంగళవారంలోపు నిర్ణయం తీసుకోవాలని గడువు నిర్దేశించింది. కాలుష్యానికి ప్రధాన కారణం రైతులు పంట వ్యర్థాలను తగులబెట్టడమేనన్న గగ్గోలుకు ఎలాంటి ఆధారం లేదని స్పష్టం చేసింది. ఢిల్లీ కాలుష్యం అంశంపై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని బెంచ్ సోమవారం విచారణను కొనసాగించింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల కార్యదర్శులతో వెంటనే సమావేశం నిర్వహించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా సీజేఐ ఏడు చేపల కథను ఉటంకించారు. ఏడు చేపలలో ఒక చేప ఎండకపోవడానికి చెప్పిన సాకుల్లా ఢిల్లీ కాలుష్యానికి కారణాలను చెబుతున్నారని మండిపడ్డారు. సాకులు మాని కాలుష్య కట్టడికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాలుష్యానికి అడ్డుకట్ట వేయాలంటే లాక్డౌన్ విధించడం, సరి-బేసి విధానం అమలు, లారీల ప్రవేశాన్ని నిషేధించడం వంటి కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఈ మేరకు పర్యావరణ, అటవీ శాఖ అఫిడవిట్ దాఖలు చేసింది. పూర్తి లాక్డౌన్ విధించడం వంటి చర్యలకు సిద్ధంగా ఉన్నామని సుప్రీంకోర్టుకు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది.