COVID-19 Vaccination for Children : కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా దేశంలో పిల్లలకు త్వరలో టీకాలు వేయనున్నారు. ఈ విషయంపై ఇప్పటి వరకు కేంద్రం ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ.. చాలా ఆసుప్రతులు టీకాలు వేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. కోల్కతాలోని చాలా ప్రైవేటు ఆసుపత్రులు పిల్లలకు టీకాలు వేసేందుకు కేంద్రాలను ఏర్పాటు చేస్తూనే.. పిల్లల డేటాబేస్ను సేకరిస్తున్నాయి. అలాగే వీలైనంత ఎక్కువ మందికి టీకాలు వేసేందుకు పాఠశాలతో కలిసి పని చేస్తున్నాయి.
ప్రస్తుతం పలు ఆసుపత్రులు కొవాగ్జిన్ టీకాను కొనుగోలు చేసేందుకు కసరత్తులు ప్రారంభించాయి. ప్రస్తుతం భారత్ బయోటెక్ తయారు చేసిన కొవిడ్ టీకాను ప్రస్తుతం 18 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే వేస్తున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ కంపెనీ 2-18 సంవత్సరాల మధ్య పిల్లలకు టీకాలు వేసేందుకు ట్రయల్స్ పూర్తి చేసింది. కొవాగ్జిన్ టీకాకు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ (SEC) అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం టీకాకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) ఆమోదముద్ర వేయాల్సి ఉంది. ఆ తర్వాత 2-18 సంవత్సరాల్లోపు పిల్లలకు టీకాలు వేయనున్నారు.
త్వరలోనే టీకాల పంపిణీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆసుప్రతులు సన్నాహాలు ప్రారంభించినట్లు చెబుతున్నాయి. కోల్కతాలోని ఆర్ఎన్ ఠాగూర్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాక్ సైన్సెన్ శుక్రవారం కొవాగ్జిన్ టీకా 20వేల డోసులకు ఆర్డర్ ఇచ్చింది. అయితే, డిమాండ్ చాలా తక్కువగా ఉన్నందున టీకాలు ఎక్కువగా ఆర్డర్లు ఇవ్వలేదని యాజమాన్యం చెబుతున్నది. పిల్ల టీకా త్వరలో ఆమోదించబడుతుందని భావిస్తున్నామని, ఈ మేరకు టీకాలు కొనుగోలు చేస్తున్నామని పేర్కొంది. అలాగే పాఠశాలలు, నివాస సముదాయాలు, కార్పొరేట్ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు నారాయణ హెల్త్ హాస్పిటల్ పేర్కొన్నది. గత కొద్ది రోజులుగా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, కార్పొరేట్ సంస్థలు చిన్నారులకు సంబంధించిన వ్యాక్సినేషన్ ఆరా తీస్తూ వస్తున్నాయి.
గత నెలలో నేషనల్ డ్రగ్స్ రెగ్యులేటర్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ (SEC) పిల్లలకు సంబంధించిన కొవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగానికి సిఫారసు చేసింది. ప్రస్తుతం వ్యాక్సిన్ను డీసీజీఐ అనుమతించాల్సి ఉండగా.. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆమోదం తెలిపితే 2-18 సంవత్సరాల పిల్లలకు టీకా అందుబాటులోకి రానున్నది. అలాగే ఆగస్ట్లో జైడస్ క్యాడిలా కంపెనీ తయారు చేసిన జైకోవ్-డీ వ్యాక్సిన్కు డీసీజీఐ ఆమోదం తెలిపింది. 12 సంవత్సరాలు పైబడిన వారందరికీ జైకోవ్-డీ వ్యాక్సిన్ వేసేందుకు అత్యవసర వినియోగం కింద అనుమతి ఇచ్చింది.
అహ్మదాబాద్కు చెందిన ఫార్మా దిగ్గజం జైడస్ క్యాడిలా తయారు చేసిన జైకోవ్-డీ వ్యాక్సిన్ను డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆగస్ట్లో ఆమోదించింది. అయినా ఇప్పటి వరకు వ్యాక్సిన్ మార్కెట్లోకి రాలేదు. అయితే, వ్యాక్సిన్ ధరను కంపెనీ రూ.1900గా నిర్ణయించగా.. కేంద్రం ధరను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కంపెనీ, ప్రభుత్వం మధ్య చర్చలు జరగ్గా.. ధర విషయంపై ఒప్పందం జరిగింది. జైకోవ్-డీ టీకా మూడో దశ ట్రయల్స్లో వ్యాక్సిన్ సమర్థత 66శాతంగా తేలింది.
ఒకటి, రెండో విడుత ట్రయల్స్లోనూ ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదు. అయితే, మూడో విడుత ట్రయల్స్కు సంబంధించిన డేటా విడుదల చేయాల్సి ఉన్నది. ఈ క్రమంలో వ్యాక్సిన్ పంపిణీ చేయకపోవడానికి ఇది కూడా ఓ కారణం కాగా.. వ్యాక్సిన్ల లభ్యత మరో కారణంగా తెలుస్తున్నది. టీకా మూడు డోసులు కాగా.. ప్రస్తుతం కంపెనీ ప్రతి నెలా కోటి డోసులు ఉత్పత్తి చేయనున్నట్లు చెబుతున్నది. ఈ పరిస్థితుల్లో డిమాండ్ మేరకు టీకాలు సరఫరా చేయడం సవాలేనని నిపుణులు పేర్కొంటున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పేద దేశాలకు తక్షణమే కోటి వ్యాక్సిన్ డోసులు: కెనడా ప్రధాని ట్రుడో
5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు ఫైజర్ టీకా సురక్షితం
Vaccine Dose : ఆరోసారి వ్యాక్సిన్ డోసు కోసం వచ్చిన బీజేపీ నేత.. ఎలా దొరికాడంటే?