ఇంఫాల్ : మణిపూర్లో ఉగ్రవాదులు మెరుపు దాడి చేశారు. 46 అస్సాం రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్తో పాటు సిబ్బంది లక్ష్యంగా దాడికి తెగబడ్డారు. ఈ ఘటన భారత్ – మయన్మార్కు సరిహద్దు, చురాచంద్పూర్ జిల్లాలోని సింఘత్ సబ్ డివిజన్లో చోటు చేసుకున్నది. దాడి జరిగిన సమయంలో క్విక్ రియాక్షన్ టీమ్తో పాటు కర్నల్ విప్లవ్ త్రిపాఠితో పాటు ఆయన కుటుంబ సభ్యులు కాన్వాయ్లోనే ఉన్నారు. ఉగ్రదాడిలో కర్నల్ విప్లవ్ త్రిపాఠి, ఆయన భార్య, కుమారుడు ఘటనలో మృతి చెందారు.
అలాగే మరో నలుగురు అస్సాం రైఫిల్స్కు చెందిన జవాన్లు సైతం ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయాలపాలవగా.. వారిని బెహియాంగ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించినట్లు తెలుస్తున్నది. ఘటనను మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ ధ్రువీకరించారు. ఘటనను తీవ్రంగా ఖండించారు. సమాచారం అందుకున్న బలగాలు సంఘటనా స్థలానికి చేరుకొని ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఆర్మీ వర్గాలు తెలిపాయి.
మణిపూర్కు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఈ దాడికి పాల్పడినట్లు ఆర్మీ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఉగ్రవాద దాడిని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఖండించారు. దాడిని పిరికిపందల చర్యగా పేర్కొన్నారు. సైనికులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్న ఆయన.. అమరులైన వారికి నివాళులర్పించారు. ఘటనకు బాధ్యులైన వారిని వదిలేది లేదని హెచ్చరించారు.