(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై)తో రైతులకు ఫాయిదా లేకుండా పోతున్నది. బీమా రుసుము కింద రూ.2 వేలు చెల్లిస్తే పంట నష్ట పరిహారంగా కనీసం వంద రూపాయలు కూడా ఇవ్వడం లేదు. నిబంధనల పేరిట చాలా మంది రైతులకు అసలు పరిహారమే చెల్లించడం లేదు. దీంతో మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లోపాటు చాలా రాష్ర్టాలు ఈ పథకాన్ని అమలుచేయడం లేదు. మహారాష్ట్రలో విదర్భ ప్రాంతంలోని ఓ రైతు పత్తి పంట వేశాడు. భారీ వర్షాల కారణంగా పూర్తిగా నష్టం వాటిల్లింది. ఫసల్ బీమా కింద రూ.2,000 చెల్లిస్తే, పంటకు బీమా పరిహారంగా రూ.90 మాత్రమే ముట్టాయి. మరో రైతుకు రూ.356 వచ్చాయి. గత వానకాలం సీజన్లో అహ్మద్నగర్ జిల్లాలోనే 7.48 లక్షల మంది రైతులు పీఎంఎఫ్బీవై కింద బీమా చెల్లించారు. అందులో 1.03 లక్షల మంది రైతులు వర్షాల కారణంగా తమ పంట దెబ్బతిన్నదని నష్టపరిహారం ఇవ్వాలని అర్జీలు పెట్టుకున్నారు. అందులో కేవలం 20,226 అర్జీలకు నష్టపరిహారం విడుదలైనట్టు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి.
కార్పొరేట్ కంపెనీలకే లబ్ధి
రైతులను ఉద్దరిస్తామని మొసలి కన్నీరు కారుస్తూ జాతీయ వ్యవసాయ బీమా పథకం రూపు రేఖలు మార్చి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనగా అమలు చేస్తున్నారు. ఈ పథకం వల్ల ప్రయోజనం లేదని బీహార్, పంజాబ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ర్టాలు అమలు జరుపలేమంటూ, సొంత బీమా పథకాల అమలుకు నిర్ణయించుకున్నాయి. ఆఖరుకు మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్ కూడా ఈ పథకం అమలు చేయబోమంటూ చేతులెత్తేసింది. పీఎంఎఫ్బీవై వల్ల రైతులకు పరిహారం అందే కంటే కార్పొరేట్ కంపెనీలకే ఎక్కువ లాభం జరుగుతున్నట్టు తమ సర్వేలో తేలిందని సెంటర్ ఫర్ ఫైనాన్సియల్ అకౌంటబిలిటీ సంస్థ పేర్కొన్నది. 2021-22లో ఈ పథకం కింద వసూలు చేసిన ప్రీమియం రుసుములో కేవలం 61 శాతం నష్టపరిహారంగా చెల్లించి బీమా సంస్థలు కోట్ల లాభాలు దండుకున్నాయి.