Ayodhya Ram Mandir | లక్నో: అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠనాడే బిడ్డకు జన్మనివ్వాలని గర్భిణులు పరితపిస్తున్నారు. తమ ఇంట్లో రాముడు జన్మించాలని కుటుంబ సభ్యులంతా కోరుకుంటున్నారు. ఇదే కోరికను వైద్యులకు చెప్పి, జనవరి 22నాడే ప్రసవించేలా చేయాలని కోరుతున్నారు. ఆ రోజు ప్రపంచమంతా గుర్తుండిపోయే మంచి రోజు కాబట్టి, తమ జీవితాల్లో కూడా మంచి జరుగుతుందని భావిస్తున్నారు. శ్రీరామునికి జన్మనిచ్చిన కౌసల్య మాదిరిగా తాము కూడా చరితార్థులం కావాలని గర్భిణులు కోరుకుంటున్నారు. దవాఖానల్లోని వైద్యులు కూడా వీరి కోరికను తీర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే గర్భిణి ఆరోగ్య పరిస్థితి బాగుంటేనే ఆ రోజు ప్రసవం జరిగేలా చేస్తామని షరతు విధిస్తున్నామని వైద్యులు చెప్పారు. అంతేకాకుండా గర్భిణుల ఫిట్నెస్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు.
7000 కిలోల రామ్ హల్వా
బాల రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరిగే ఈ నెల 22న భక్తులకు పంచేందుకు దేశానికి చెందిన ప్రముఖ చెఫ్ విష్ణు మనోహర్ 7,000 కిలోల ప్రత్యేక ‘రామ్ హల్వా’ తయారు చేయనున్నారు. ఈ ప్రత్యేక వంటకం కోసం అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. రామ్హల్వా తయారీ కోసం 12 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన కడాయిని కొనుగోలు చేశారు. 900 కిలోల రవ్వ, వెయ్యి కిలోల వెన్న, వెయ్యి కిలోల చక్కెర, 2000 లీటర్ల పాలు, 2500 లీటర్ల నీరు, 300 కిలోల డ్రైఫ్రూట్స్, 75 కిలోల యాలకుల పొడిని ఈ వంటకంలో వాడతారు. రామ్హల్వా తయారీ కోసం వాడే కడాయి బరువే 1300-1400 కిలోలు ఉంటుంది.
అత్తగారింటి నుంచి 3000 కానుకలు
నేపాల్లోని అత్తగారి ఇంటి నుంచి శ్రీరాముడికి 3000 కానుకలు అందాయి. నేపాల్లోని జనక్పూర్ ధామ్ రామ్ జానకీ టెంపుల్ నుంచి సుమారు 500 మంది రామభక్తులు ఆదివారం అయోధ్యకు చేరుకున్నారు. వీరు సీతారాముల కోసం 3,000 విలువైన కానుకలను తీసుకొచ్చా రు. కానుకల్లో నగదు, దుస్తులు, పండ్లు, స్వీట్లు, బంగారు, వెండి ఆభరణాలతోపాటు ఇతర విలువైన వస్తువులు ఉన్నాయి.
రామాయణ కాలం నాటి మొక్కలు
అయోధ్యలో రామాయణ కాలం నాటి మొక్కలు, అంతరించిపోయిన వృక్షజాతులను నాటాలని ఆలయ నిర్వాహకులు నిర్ణయించారు. ఇందులో భాగంగా 50 వేల మొక్కలకు ఆర్డర్ ఇచ్చామని, త్వరలోనే అవి నగరానికి చేరుకుంటాయని అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ నర్సరీ డైరెక్టర్ రామ్ ప్రకాశ్ రాథోడ్ తెలిపారు. మరిన్ని రకాల మొక్కలను కూడా ఇక్కడకి తెప్పిస్తున్నామన్నారు.