అహ్మదాబాద్ : ముస్లిం మహిళలను కిడ్నాప్ చేసి లైంగిక దాడి చేస్తానని బహిరంగంగా యూపీలో ఓ స్వామీజీ హెచ్చరించడం కలకలం రేపగా తాజాగా గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రవీణ్ తొగాడియా అనుచరుడు ముస్లిం మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రీయ భజరంగ్ దళ్ జాతీయ అధ్యక్షుడు మనోజ్ కుమార్ అహ్మదాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ విద్వేష వ్యాఖ్యలు చేశారు.
ముస్లింలను కించపరిచే వ్యాఖ్యలు చేసిన సందర్భంలో వేదికపై అంతరాష్ట్రీయ హిందూ పరిషత్ (ఏహెచ్పీ) నేత ప్రవీణ్ తొగాడియా అక్కడే ఉన్నా వారించకపోవడం గమనార్హం. కాశీ, మధురలో ఈ శతాబ్ధంలోనే ప్రవీణ్ తొగాడియా ఆలయాలకు శంకుస్ధాపనలు చేస్తారని వ్యాఖ్యానించారు.
ఏహెచ్పీ నిర్వహించిన త్రిశూల్ దీక్ష సందర్భంగా తొగాడియా సమక్షంలోనే మనోజ్ కుమార్ ముస్లింలపై విద్వేష వ్యాఖ్యలు చేశారు. మార్చి 27న ఈ కార్యక్రమం జరగ్గా విద్వేష వ్యాఖ్యలు చేసిన మనోజ్పై పోలీసులు ఇంతవరకూ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మనోజ్ విద్వేష వ్యాఖ్యలపట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.