న్యూఢిల్లీ, జూలై 14: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్టు తెలుస్తున్నది. మంగళవారం ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసంలో సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆ ముగ్గురూ ప్రశాంత్ కిశోర్ను కాంగ్రెస్లోకి ఆహ్వానించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ప్రశాంత్ కిశోర్ వస్తే పార్టీలో ఏ బాధ్యతలు అప్పజెప్తారన్న విషయంపై కూడా చర్చ జరిగినట్టు సమాచారం. అందరూ అనుకొన్నట్టు ఇది పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు మాత్రమే పరిమితమైన సమావేశం కాదని, అంతకంటే పెద్ద లక్ష్యమే ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రశాంత్ కిశోర్ పావులు కదుపుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వాదనకు మరింత బలం ఇచ్చేలా… ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ హరీశ్ రావత్ వ్యాఖ్యలు చేశారు. కానీ మూడు నాలుగు రోజుల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఓ శుభవార్త వింటారని అన్నారు. ‘శుభవార్త అంటే ఒక పంజాబ్కే కాదు. కాంగ్రెస్ కార్యకర్తలందరికీ శుభవార్త’ అని చెప్పారు.
రాష్ట్రపతిగా పవార్కు మద్దతు కోసమే
సోనియా, రాహుల్, ప్రశాంత్ కిశోర్ మధ్య భేటీపై మరో రకం ఊహాగానాలు కూడా వస్తున్నాయి. వచ్చే ఏడాది రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరఫున శరద్పవార్ను నిలబెట్టి గెలిపించడం కోసం ప్రశాంత్ కిశోర్ మద్దతు కూడగడుతున్నారని కొంతమంది భావిస్తున్నారు. ఎన్నికల వ్యూహకర్తగా కిశోర్కు కొన్ని రాష్ర్టాల సీఎంలతో సత్సంబంధాలున్నాయి. వారిలో కొన్ని పార్టీలు ఎన్డీయేను వ్యతిరేకిస్తున్నాయి. ఎన్డీయే వ్యతిరేక పార్టీలతో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ చేతులు కలిపితే పవార్ గెలుపు ఖాయమని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. అయితే, తన రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై వచ్చిన ఊహాగానాలపై శరద్ పవార్ స్పందించారు. రాష్ట్రపతి రేసులో లేనని బుధవారం స్పష్టం చేశారు.