పనాజీ : తదుపరి గోవా సీఎం ఎవరనేదానిపై బీజేపీ అగ్రనాయకత్వం నుంచి లాంఛనంగా ఎలాంటి ప్రకటనా వెలువడకపోయినా గోవా సీఎంగా తాను కొనసాగుతానని ఆపద్ధర్మ సీఎం ప్రమోద్ సావంత్ విశ్వాసం వ్యక్తం చేశారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చిన ప్రమోద్ సావంత్ తన నియోజకవర్గంలో స్వల్ప ఆధిక్యంతో గెలుపొందారు.
తాను రాష్ట్ర ఎన్నికల ప్రచార బాధ్యతలను చేపట్టానని త్వరలోనే సీఎం పేరు ఖరారవుతుందని చెప్పారు. కాగా తదుపరి సర్కార్ కొలువుతీరేందుకు వీలుగా శనివారం గోవా గవర్నర్ పీఎస్ పిళ్లైని కలిసిన ప్రమోద్ సావంత్ సీఎం పదవికి రాజీనామా చేస్తూ పత్రాలను సమర్పించారు.
కేంద్ర పరిశీలకులు త్వరలో రాష్ట్రానికి రానున్నారని ఎమ్మెల్యేలతో చర్చలు జరిపి ఆపై రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు తాము ముందుకొస్తామని చెప్పారు. ముగ్గురు ఇండిపెండెంట్లు, ఎంజీపీ ఎమ్మెల్యే మద్దతు తమకుందని మెజారిటీ విషయంలో తాము తొందరపడాల్సిన అవసరం లేదని సావంత్ చెప్పుకొచ్చారు. గోవాలో 40 అసెంబ్లీ స్ధానాలకు గాను బీజేపీ 20 స్దానాల్లో విజయం సాధించింది.