స్పెషల్ టాస్క్ బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): వచ్చే ఏడాది నాలుగు ఈశాన్య రాష్ర్టాలకు (త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం) అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వీటిల్లో మిజోరం మినహా తక్కిన మూడు రాష్ర్టాల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్నాయి. త్రిపురలో బీజేపీ నేతృత్వంలోని అధికార కూటమికి వరుసగా ఎమ్మెల్యేలు గుడ్బై చెబుతున్నారు. ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో కీలక నేతలు ఒక్కొక్కరిగా చేజారుతుండటం ఆ పార్టీ నేతలను కలవరపరుస్తున్నది. మరోవైపు కొత్తగా పుట్టుకొచ్చిన త్రిపుర ప్రాంతీయ ప్రగతిశీల కూటమి.. అధికార బీజేపీకి సవాల్ విసురుతున్నది. రాజకీయంగా కాంగ్రెస్ మూలాలున్న రాజవంశానికి చెందిన ప్రద్యోత్ కిశోర్ దేవ్ బర్మన్ నేతృత్వంలోని ఈ కొత్త పార్టీ కమలనాథులకు కొరకురాని కొయ్యగా తయారైంది.
ఎవరీ ప్రద్యోత్ కిశోర్?
ప్రద్యోత్ కిశోర్ దేవ్ బర్మన్ త్రిపుర చివరి రాజు అయిన కిరిట్ బిక్రమ్ దేవ్ బర్మన్, బింబు కుమారి దేవ్ కుమారుడు. బింబు కుమారి 1989 నుంచి 1991 వరకు త్రిపురలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మంత్రిగా, పార్లమెంట్ సభ్యురాలిగా పనిచేశారు. ప్రద్యోత్.. త్రిపుర కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిన అనుభవం ఉన్నది.
త్రిపుర గిరిజన ప్రాంత ప్రత్యేక ప్రతిపత్తి కౌన్సిల్ ఎన్నికల్లో సత్తా
తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంతో ఆవిర్భవించి తెలంగాణ రాష్ట్ర సమితి, తన తొలి రాజకీయ ప్రస్థానంలోనే జిల్లా పరిషత్ ఎన్నికల్లో సత్తా చాటినట్టుగానే ప్రద్యోత్ స్థాపించిన త్రిపుర ప్రాంతీయ ప్రగతిశీల కూటమి.. త్రిఫుర గిరిజన ప్రాంత ప్రత్యేక ప్రతిపత్తి డిస్ట్రిక్ కౌన్సిల్ ఎన్నికల్లో సత్తా చాటింది. 28 సీట్లలో 18 సీట్లు గెలుచుకొని బీజేపీ నేతృత్వంలోని త్రిపుర ప్రాంతీయ పీపుల్స్ ఫ్రంట్ను కంగు తినిపించింది.
త్రిపుర మట్టి వాసన గల పార్టీగా…
త్రిపుర జనాభాలో మూడింట ఒక వంతు ప్రజలు ఆదివాసీలు. ఆదె తెగకు చెందిన రాజవంశీయుల కుటుంబానికి చెందిన ప్రద్యోత్ కిశోర్ను స్థానిక ప్రజలు తమ మూలాల నుంచి వచ్చిన నేతగా ఆదరిస్తున్నారు. త్రిపురలో ప్రాంతీయ ప్రత్యేక ప్రతిపత్తి కౌన్సిల్ పరిధిలోని భూభాగంలో మూడింట రెండు వంతులు ప్రద్యోత్ పార్టీ కైవసం చేసుకోవడం బీజేపీని ఆందోళనకు గురిచేస్తున్నది. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభావం ఉంటుందని కలవరం చెందుతున్నది.
బీజేపీకి మరో ఎమ్మెల్యే గుడ్బై
త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ రాష్ట్రంలో బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీకి చెందిన కరంచెర్ర ఎమ్మెల్యే దిబచంద్ర హ్రంగ్ఖావల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. త్రిపురలో అధికార కూటమి నుంచి ఈ ఏడాది రాజీనామా చేసిన ఏడో ఎమ్మెల్యే ఆయన. ఈ ఏడాది మొత్తం నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రజల మూడ్ను ముందే పసిగట్టి వీరు బీజేపీకి దూరమవుతున్నట్లు కనిపిస్తున్నది. దిబచంద్ర అనారోగ్య కారణాల వల్ల రాజీనామా చేసినట్లు బీజేపీ చెబుతున్నా తాను రాజకీయాల్లోనే ఉంటానని, తదుపరి కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానని ప్రకటించారు. గతంలో దిబచంద్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పని చేసి 2018 ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. ఆయన త్వరలో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలు ఉన్నాయి. రాజీనామా తర్వాత పలువురు కాంగ్రెస్ నేతలు ఆయనను కలిశారు. దిబచంద్రకు సన్నిహితుడైన సుదీప్ రాయ్ అనే నేత కూడా ఇటీవల బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు.