న్యూఢిల్లీ, జూలై 10: భారతీయులను విభజించేందుకు రాజకీయ అవకాశవాదులు చేస్తున్న కుట్రలు దేశంలో ప్రస్తుతం పెరిగిపోతున్నాయని ప్రఖ్యాత ఆర్థికవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్యసేన్ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజల ఐక్యతను కాలరాసేందుకు కొందరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి సమయంలోనే ప్రశ్నించే శక్తిమంతమైన గొంతుక అవసరమని నొక్కిచెప్పారు. బెంగాలీ వార్తాపత్రిక ‘ఆనందబజార్’ వందో వార్షికోత్సవం సందర్భంగా శనివారం నిర్వహించిన వర్చువల్ కార్యక్రమంలో ప్రసంగించారు. ‘రాజకీయ అవకాశవాద శక్తులు భారతీయుల్లో విభజన తెస్తున్నాయి. దేశంలో కలిసిమెలసి జీవిస్తున్న హిందూ, ముస్లింల మధ్య మతం పేరిట చీలికకు ప్రయత్నిస్తున్నాయి. మన ఐకమత్యాన్ని ధ్వంసం చేస్తున్నాయి. దీన్ని ప్రశ్నించడానికి ఈ సమయంలో ఓ శక్తిమంతమైన గొంతుక కావాలి’ అని అమర్త్యసేన్ అన్నారు.
రాజకీయ కారణాలతో ప్రజలను జైళ్లో పెట్టడం వంటి వలసకాలం నాటి విధానాలు స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచినప్పటికీ దేశంలో ఇంకా కొనసాగుతున్నాయని అమర్త్యసేన్ ఆవేదన వ్యక్తంచేశారు. సీఏఏకు వ్యతిరేకంగా 2020లో ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి హక్కుల కార్యకర్త ఉమర్ ఖలీద్ను జైళ్లో పెట్టడాన్ని ప్రస్తావిస్తూ.. సేన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తప్పు చేయకపోయినప్పటికీ, ప్రశ్నించే వారిని కేంద్రప్రభుత్వం వేధింపులకు గురిచేస్తున్నదని మండిపడ్డారు. తమ మీద వచ్చిన ఆరోపణలపై కనీస విచారణకు నోచుకుకుండానే ఎంతోమంది జైళ్లలో మగ్గుతున్నారని అమర్త్యసేన్ ఆందోళన వ్యక్తంచేశారు. న్యాయమార్గాన్ని అందరూ అనుసరించాలని హితవు పలికారు. ప్రజల కోసం పోరాడే మనవాళ్లను విదేశాల్లోని ప్రముఖులు ప్రశంసిస్తున్నప్పటికీ.. ఇక్కడి వారు గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. గత నెల 30న కూడా అమర్త్యసేన్ ఈ తరహా వ్యాఖ్యలే చేశారు. ‘విభజన రాజకీయాలు విద్వేషాగ్నిని రగిలిస్తున్నాయి. ఈ దేశాన్ని చూస్తుంటే భయమేస్తున్నది. ప్రజలంతా సమైక్యతను చాటాలి’ అని ఆయన కోరారు.