భోపాల్: బిల్లు కట్టకపోవడంతో కరెంటు కట్ చేయడానికి వెళ్లిన విద్యుత్ సిబ్బందిపై (Power Officials) మహిళలు దాడికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్లోని (Madhya Pradesh) రాజ్గఢ్ జిల్లాలో చోటుచేసుకున్నది. జమిల ఖటూన్ అనే మహిళ కుటుంబం విద్యుత్ చౌర్యానికి పాల్పడుతుండటంతో విజిలెన్స్ అధికారులు ఈ ఏడాది జనవరి 29న ఆమెకు రూ.98,207 జరిమానా విధించారు. ఫిబ్రవరి 25 నాటికి బిల్లు చెల్లించాలని ఆదేశించారు. దీంతో రూ.40 వేలు చెల్లించిన ఆమె.. మిగిలిన మొత్తాన్ని వాయిదా వేస్తూ వస్తున్నది. దీంతో అధికారులు ఆమెకు మరికొంత గడువు ఇచ్చారు. అయినప్పటికీ పట్టించుకోకపోవడంతో విద్యుత్ కనెక్షన్ కట్చేస్తామని నోటీసులు పంపారు.
ఉనతాధికారుల ఆదేశాల మేరకు జూనియర్ ఇంజినీర్ తన సిబ్బందితో కలిసి కరెంట్ కట్ చేయడానికి ఆమె నివాసానికి వెళ్లారు. అయితే వారికి అడ్డుతగిలిన జమిల.. తన కూతురు, అల్లుడితో కలిసి విద్యుత్ సిబ్బందిపై కర్రలతో దాడి చేశారు. బూతులు తిడుతూ కర్రలతో విరుచుకుపడ్డారు. దీంతో అక్కడి నుంచి బయటపడిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐదుగురిపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.