చెన్నై : తమిళనాడులో దారుణ ఘటన వెలుగుచూసింది. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ తిరువరూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న మహిళ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో మరణించింది. మృతురాలిని 48 ఏండ్ల అమరావతిగా గుర్తించారు. ఆస్పత్రి ఎమర్జెన్సీ విభాగంలో పవర్ బ్యాకప్ లేకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని బాధితురాలి కుటుంబసభ్యులు అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు.
ఈ ఆరోపణలను తోసిపుచ్చిన ప్రభుత్వం మహిళా రోగి మరణానికి దారితీసిన పరిస్ధితులపై దర్యాప్తునకు ఓ బృందాన్ని నియమించింది. ఎమర్జెన్సీ విభాగంలో విద్యుత్ లేకపోవడం ఏంటని వైద్యులను ఓ వ్యక్తి ప్రశ్నిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. టార్చ్లైట్ వెలుగులో వైద్యుడు ఓ రోగికి ఇంజక్షన్ చేస్తుండటం కనిపించింది.
మహిళ ఊపిరితిత్తులు, గుండె సమస్యలతో బాధపడుతూ మరణించిందని కరెంట్ కేవలం అయిదు నిమిషాల పాటే నిలిచిపోయిందని ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ పేర్కొన్నారు. వెంటిలేటర్స్కు గంట వరకూ బ్యాటరీ బ్యాకప్ ఉంటుందని మంత్రి తెలిపారు. వెంటిలేటర్పై ఉన్న మరో నలుగురు ఇతర రోగులకు ఎలాంటి సమస్య తలెత్తలేదని మంత్రి గుర్తుచేశారు.
Read More :