శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో గత నాలుగైదు రోజులుగా ఉగ్రవాదుల కదలికలు పెరిగిపోయాయి. శనివారం ఉదయం ఉగ్రవాదులు శ్రీనగర్లోని బార్బర్ షా చౌక్ ఏరియాలో పోలీస్ క్యాంప్ లక్ష్యంగా గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. ఆదే రోజు అర్ధరాత్రి రెండు గంటలకు జమ్ము ఎయిర్ఫోర్స్ స్టేషన్పై డ్రోన్ల సాయంతో బాంబులు జారవిడిచారు. ఆదివారం రాత్రి 11 గంటలకు ఇద్దరు ముష్కరులు పోలీస్ ఆఫీసర్ ఫయాజ్ అహ్మద్ ఇంట్లో చొరబడి ఆయనను, ఆయన భార్యను, కూతురును కాల్చిచంపారు.
ఈ నేపథ్యంలో ముష్కరుల ఏరివేత కోసం జమ్ముకశ్మీర్లోని అన్ని ప్రాంతాల్లో పోలీసుల, భద్రతాబలగాలు సంయుక్తంగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఈ సాయంత్రం శ్రీనగర్లోని మల్హూరా పారింపొరా ఏరియాలో ఉగ్రవాదులు తారసపడటంతో ఎదురు కాల్పులు మొదలయ్యాయి. ఈ ఎన్కౌంటర్కు సంబంధించి సెక్యూరిటీ సిబ్బంది విడుదల చేసిన ఒక వీడియోలో కాల్పుల మోతలు, పేలుళ్ల శబ్దాలు దద్ధరిల్లుతున్నాయి.