ఏ ఎన్నికలైనా పార్టీల చుట్టూ… నేతల చుట్టూ తిరుగుతుంటాయి. మహా అయితే స్థానిక అంశాల చుట్టూనే తిరుగుతుంటాయి. ఉత్తరాఖండ్ ఎన్నికలు మాత్రం ఈ సారి చాలా భిన్నంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ఇద్దరూ ఓ మహా వ్యక్తి చుట్టూ రాజకీయాలను తిప్పేందుకు సిద్ధమైపోయారు. ఈ సారి ఉత్తరాఖండ్ ఎన్నికల్లో దేశ ప్రథమ సీడీఎస్ బిపిన్ రావత్ కీలకం కాబోతున్నారు. ఇరు జాతీయ పార్టీలు కూడా ఆయన కటవుట్ను వాడుకుంటున్నాయి. దీంతో బీజేపీ, కాంగ్రెస్ మధ్య రావత్ వార్ నడుస్తోంది. కాంగ్రెస్కు సంబంధించిన ఓ ర్యాలీలో సీడీఎస్ బిపిన్ రావత్ కు సంబంధించిన భారీ కటవుట్ దర్శనమిచ్చింది. ఓ వైపు రాహుల్ గాంధీ కటవుట్… మరో వైపు ఇందిరా గాంధీ కటవుట్… వీరిద్దరి మధ్యలో బిపిన్ రావత్ కటవుట్. అయితే రాహుల్ సైజ్ కంటే బిపిన్ రావత్ కటవుట్ సైజు చాలా పెద్దదిగా ఉంది.
1971 లో పాక్పై భారత్ సాధించిన విజయాన్ని పురస్కరించుకొని ఉత్తరాఖండ్ వేదికగా కాంగ్రెస్ ఓ పెద్ద సభ నిర్వహిస్తోంది.ఈ సభకు రాహుల్ హాజరవుతున్నారు. ఈ సందర్భంగానే రావత్ కటవుట్ పెట్టారు. అయితే దీనిపై అధికార బీజేపీ భగ్గుమంది. దేశ ప్రథమ సీడీఎస్ రావత్ను కాంగ్రెస్ ఓ రాజకీయ వస్తువుగా వాడుకుంటోందని, ఇలా వాడటం ఏమాత్రం బాగో లేదని బీజేపీ సీరియస్ అయింది. కుటుంబ రాజకీయాలను నడిపే వారు దేశభక్తుడైన రావత్ ఫొటోను ఎలా పెడతారంటూ తీవ్రంగా మండిపడింది. అంతేకాకుండా దేశ జవాన్లను అవమానించడం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉందని బీజేపీ మండిపడింది. అయితే దీనిపై కాంగ్రెస్ అంతే రీతిలో సమాధానమిచ్చింది. ఉత్తరాఖండ్లో రాహుల్ పాల్గొనే సభ రాజకీయ సభ ఎంత మాత్రమూ కాదని కాంగ్రెస్ ప్రకటించింది.