లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ప్రియాంక గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లడ్కీ హూ..లడ్శక్తీ హూ క్యాంపెయిన్ పోస్టర్ గర్ల్ పల్లవి సింగ్ ఆ పార్టీకి రాజీనామా చేసి కాషాయ పార్టీలో చేరారు. అంతకుముందు ఈ క్యాంపెయిన్లో పాలుపంచుకున్న మరో ఇద్దరు పోస్టర్ గర్ల్స్ ప్రియాంక మౌర్య, వందనా సింగ్లు ఇటీవల కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని కినుక వహించిన వందనా సింగ్ బుధవారం కాషాయ పార్టీలో చేరారు. ఇటీవల చేరిన వారికే పార్టీలో ప్రాధాన్యత లభిస్తోందని, తాను కాంగ్రెస్ పార్టీ కోసం ఆరేండ్లుగా కష్టపడి పనిచేస్తున్నా తనను పక్కనపెట్టారని ఆమె వాపోయారు.
తాను మహిళా విభాగంగా ఉపాధ్యక్షురాలిగా ఉన్నా కనీసం ప్రియాంక గాంధీతో మాట్లాడే అవకాశం తమకు రాలేదని అన్నారు. ఇక ప్రియాంక మౌర్యకు పార్టీ టికెట్ దక్కకపోవడంతో ఆమె బీజేపీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ల కేటాయింపులో గోల్మాల్ జరిగిందని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తన ఇమేజ్, పేరును వాడుకుందని, ప్రచారం కోసం పది లక్షల మంది తన సోషల్ మీడియా ఫాలోవర్లను వాడుకుందని ఆమె పేర్కొన్నారు. పార్టీ టికెట్ మాత్రం తనకు నిరాకరించి వేరొకరికి ఇచ్చారని ఆమె వాపోయారు. ఇక యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం టికెట్లను అంటే దాదాపు 160 మంది మహిళా అభ్యర్ధులను బరిలో దింపుతామని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఇటీవల పేర్కొన్నారు.
ఇక పిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకూ ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో గెలుపొంది మరోసారి పాలనా పగ్గాలు చేపట్టాలని పాలక బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతుండగా, యోగి సర్కార్పై వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అందలం ఎక్కాలని అఖిలేష్ యాదవ్ సారధ్యంలోని ఎస్పీ పావులు కదుపుతోంది. ఇక ప్రియాంక గాంధీ ఇమేజ్తో ఉనికి చాటుకోవాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతుండగా, దళితులు..అణగారిన వర్గాల వారి వెన్నుదన్నుతో సత్తా చాటాలని మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ కసరత్తు సాగిస్తోంది.