మొదటి విడుతలో 38 సీట్లకు పోలింగ్
బరిలో 173 మంది అభ్యర్థులు
వేర్వేరుగా సంకీర్ణ ప్రభుత్వ పార్టీల పోటీ
అసంతృప్తుల సెగతో బీజేపీకి గుబులు
ఇంఫాల్, ఫిబ్రవరి 27: ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు రంగం సిద్ధమైంది. 60 స్థానాలు ఉన్న అసెంబ్లీలో మొదటి విడుతలో భాగంగా సోమవారం ఐదు జిల్లాల పరిధిలోని 38 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఆయా స్థానాల్లో మొత్తం 173 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అభ్యర్థుల్లో 15 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. మొదటి విడుత పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల సంఘం (ఈసీ) అధికారులు వెల్లడించారు. 38 నియోజకవర్గాల పరిధిలో 1,721 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, సిబ్బంది ఆయా కేంద్రాలకు ఇప్పటికే చేరుకున్నారని తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు పెద్దయెత్తున భద్రతా బలగాలను కూడా మోహరించారని చెప్పారు.
పార్టీల విస్తృత ప్రచారం
మణిపూర్లో 53 శాతం మెయిటీ కమ్యూనిటీకి చెందిన వారే. నాగాలు 24 శాతం, కుకిలు 16 శాతం ఉన్నారు. ఎన్నికల పోరులో ఓటర్లను ఆకట్టుకునేందుకు అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పెద్దయెత్తున ప్రచారం సాగించాయి. బీజేపీ తరపున ప్రధాని మోదీ కేంద్రమంత్రులు అమిత్షా, రాజ్నాథ్.. కాంగ్రెస్ కోసం రాహుల్, ప్రియాంక ప్రచారం చేశారు. అభివృద్ధి, తీవ్రవాదం, డ్రగ్స్ అక్రమ రవాణా, సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం-1958 రద్దు, మహిళా సాధికారత, నిరుద్యోగం, అవినీతి ప్రధాన అంశాలుగా ప్రచార పర్వం సాగింది.
వేర్వేరుగా బీజేపీ, ఎన్పీపీ, ఎన్పీఎఫ్
2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 60 స్థానాలకు గానూ 21 నియోజకవర్గాల్లో మాత్రమే గెలిచినప్పటికీ అధికారం చేపట్టింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నేషనల్ పీపుల్స్ పార్టీ, నాగా పీపుల్స్ ఫ్రంట్, స్వతంత్రుల సాయం తీసుకున్నది. అయితే ఈసారి ఎన్నికల్లో బీజేపీ, ఎన్పీపీ, ఎన్పీఎఫ్ విడివిడిగా పోటీచేస్తున్నాయి. గత ఎన్నికల్లో 28 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినా కాంగ్రెస్ అధికారం చేపట్టలేకపోయింది. ఈసారి ఎన్నికల్లో నాలుగు వామపక్ష పార్టీలు, జనతాదళ్ సెక్యూలర్తో బరిలోకి దిగింది.
లుకలుకలతో బీజేపీలో ఆందోళన
ప్రస్తుత రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ హెయిన్గాంగ్ నుంచి పోటీచేస్తున్నారు. ఆయనకు పోటీగా కాంగ్రెస్ నుంచి శరత్చంద్రసింగ్ బరిలో ఉన్నారు. 2007, 12లో ఈ స్థానం నుంచే కాంగ్రెస్ టికెట్పై గెలిచిన బీరేన్సింగ్ 2016లో బీజేపీలో చేరారు. కాగా, ఎన్నికల ముందు రాష్ట్ర బీజేపీ నేతల్లో నెలకొన్న లుకలుకలు ఆ పార్టీకి తలనొప్పిగా మారాయి. టికెట్ రాకపోవడంతో పలువురిలో అసంతృప్తి నెలకొన్నది. వారు బహిరంగంగానే పార్టీపై విమర్శలు చేశారు. ఎన్నికల్లో దీని ప్రభావం ఎలా ఉంటుందోనని బీజేపీ ఆందోళనలో ఉన్నది.