న్యూఢిల్లీ, ఏప్రిల్ 9 : అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీలకు గురువారం నిర్వహించిన ఎన్నికల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. అస్సాం, పుదుచ్చేరిలో రికార్డ్స్థాయి ఓటింగ్ నమోదుకాగా, కేరళలో గత ఎన్నికల కంటే ఎక్కువగా ఓటింగ్ నమోదైంది. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన తుది గణాంకాల ప్రకారం, అస్సాంలో 84.42 శాతం, కేరళలో 78.12 శాతం, పుదుచ్చేరిలో 89.87 శాతం ఓటింగ్ నమోదైంది.
కేరళ, పుదుచ్చేరిల్లో పోలింగ్ చాలా వరకు ప్రశాంతంగా సాగింది. అస్సాంలో రెండు చోట్ల ఘర్షణలు చోటుచేసుకోగా, ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం ఓటింగ్ ప్రారంభమైన తర్వాత పలు పోలింగ్ బూత్ల వద్ద చిన్నపాటి ఘర్షణలు చెలరేగి, స్వల్ప గాయాలయ్యాయని అధికారులు చెప్పారు. ఓటింగ్ ప్రక్రియలో కేరళ సీఎం పినరయ్ విజయన్, అస్సాం సీఎం హిమంత, మలయాళ నటులు మమ్ముట్టి, మోహన్లాల్తో సహా పలువురు సీనియర్ నాయకులు, అభ్యర్థులు, ప్రజా ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.