చెన్నై: ఒక ఇంట్లో భారీగా డబ్బు ఉన్నట్లు ఎన్నికల అధికారులకు సమాచారం అందింది. దీంతో రాత్రి వేళ ఆ ఇంటిపై రైడ్ చేశారు. తనిఖీ చేయగా బస్తాలో దాచిన కోటి నగదును గుర్తించారు. ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. (1 Crore Cash Seized) తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఈ సంఘటన జరిగింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ అధికారులు డబ్బు తరలింపుపై నిఘా పెట్టారు. అలాగే అనుమానిత ప్రదేశాల్లో సెర్చ్ చేస్తున్నారు.
కాగా, తిరుచ్చి జిల్లా కలెక్టరేట్లోని ఎలక్షన్ కంట్రోల్ రూమ్కు శుక్రవారం ఒక సమాచారం అందింది. ఎత్తరై గ్రామంలోని ఓ ఇంట్లో భారీగా డబ్బు ఉన్నట్లు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు శుక్రవారం రాత్రి ఆ ఇంటిపై రైడ్ చేశారు. ఒక బస్తాలో కరెన్సీ నోట్ల కట్టలు ఉన్నట్లు తనిఖీలో గుర్తించారు. సుమారు కోటి నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బు గురించి ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇంట్లో భారీగా డబ్బు దాచడంపై దర్యాప్తు చేస్తున్నారు.