బీజేపీ రాజకీయాలపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పరోక్షంగా విరుచుకుపడ్డారు. మతపరమైన రాజకీయాలు చేయడం చాలా సులువని, అవి పాతుకుపోయినప్పుడు వాటి నుంచి బయటికి రావడం మాత్రం అంత సులువైన విషయం కాదన్నారు. మతం, కులం, ఆధారంగా ప్రజలను రెచ్చగొట్టడం, రాజకీయాలు చేయడం చాలా సులువైన పని. అయితే వాటి నుంచి బయటికి రావడం మాత్రం అంత సులువైన విషయం కాదు. వారు దేశ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించుకోవాలి అని పరోక్షంగా బీజేపీకి చురకలంటించారు. మతం ఆధారంగా పాకిస్తాన్ ఏర్పడింది. కానీ నిలబడలేక రెండుగా విడిపోయిందని విశ్లేషించారు.
దేశాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారని, అయితే మతం ఆధారంగా దేశం ఎన్నటికీ ఏకతాటిపైకి రాదని గెహ్లాత్ పేర్కొన్నారు. మరోవైపు.. ఏ ఉత్తరానికి కూడా సమాధానం ఇవ్వకూడదని ప్రధాని మోదీ ప్రతిజ్ఞ తీసుకున్నారేమోనని ఆయన చురకలంటించారు. ఇప్పటికే పలు దేశాల్లో పిల్లలకు కూడా వ్యాక్సిన్ డోసులు ఇవ్వడ ప్రారంభమైందని, బూస్టర్ డోసులు కూడా ఇస్తున్నారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ కాస్త నిపుణుల సలహాలను పరిగణనలోకి తీసుకొని, బూస్టర్ డోసులను త్వరగా ఇచ్చే ఏర్పాట్లు చేయాలని గెహ్లాత్ విజ్ఞప్తి చేశారు.