న్యూఢిల్లీ, ఆగస్టు 17: సిమ్ డీలర్లకు పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే సైబర్ మోసాలపై ఉక్కు పాదం మోపడానికి బల్క్గా (ఒకేసారి ఎక్కువ మొత్తంగా) సిమ్ కార్డుల జారీ చేసే విధానాన్ని నిలిపేశామని తెలిపింది. అయితే వాటి స్థానంలో బిజినెస్ కనెక్షన్లను ప్రవేశపెడతామని పేర్కొన్నది. ఈ ఏడాది మే వరకు 52 లక్షల మొబైల్ కనెక్షన్లను తొలగించినట్టు గురువారం కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. 67 వేల మంది డీలర్లను బ్లాక్ లిస్ట్లో పెట్టామని, 300 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని వెల్లడించారు. తప్పుడు పనుల్లో ప్రమేయం ఉన్న 66 వేల ఖాతాలను వాట్సాప్ బ్లాక్ చేసిందన్నారు.
నిబంధనలు ఉల్లంఘించిన సిమ్ డీలర్లకు రూ.10 లక్షల జరిమానా విధిస్తామని మంత్రి చెప్పారు. క్షేత్రస్థాయి పరిశీలన, టెలికం సర్వీస్ ప్రొవైడర్లు, పోలీస్ ఏజెన్సీలతో చర్చించిన తర్వాతే ఈ కొత్త నిబంధనలను తీసుకొస్తున్నట్టు ఆయన తెలిపారు. ‘కొత్త సిమ్ కార్డ్ డీలర్లకు పోలీస్ వెరిఫికేషన్, బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి. పాయింట్ ఆఫ్ సేల్ డీలర్లందరికీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. బిజినెస్సుల కేవైసీ వివరాలతో పాటు సిమ్ డీలర్ల కేవైసీ వివరాలను సేకరిస్తాం’ అని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న సిమ్ డీలర్లకు పోలీస్ వెరిఫికేషన్ కోసం తగినంత సమయం ఇస్తామన్నారు. యూజర్ల భద్రతను పటిష్ఠం చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ సంస్కరణలు తెస్తున్నామని తెలిపారు. చాలా మంది డీలర్లు సిమ్ల అమ్మకానికి సంబంధించి లీగల్ వెరిఫికేషన్ను పాటించరని ఆయన అన్నారు. ఈ కొత్త నిబంధనలు ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి అమలు కానున్నాయి.
పంజాబ్ పోలీసులు, టెలికాం శాఖతో కలిసి నిర్వహించిన ఆపరేషన్లో తప్పుడు పత్రాలతో తీసుకున్న సిమ్ కార్డులను జాతి వ్యతిరేక కార్యకలాపాలకు వాడుతున్నట్టు తేలింది.