న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: తమ డిమాండ్ల సాధన కోసం అన్నదాతలు చేపట్టిన ‘చలో ఢిల్లీ’ మార్చ్ బుధవారం రెండో రోజుకు చేరుకున్నది. ట్రాక్టర్లతో దేశ రాజధానిలోకి ప్రవేశించేందుకు అన్నదాతలు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. వీరిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో పంజాబ్-హర్యానా సరిహద్దులోని శంభు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బారికేడ్లను తొలగించేందుకు యత్నించిన రైతులపై పోలీసులు భాష్పవాయువును ప్రయోగించారు. పోలీసులపై రైతులు రాళ్లు రువ్వారు. జింద్ జిల్లాలోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొన్నది.
పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, రైతుల రుణాలు మాఫీ చేయాలన్న డిమాండ్తో సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా ‘చలో ఢిల్లీ’ మార్చ్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భారీగా బలగాలను మోహరించారు. పెద్ద ఎత్తున బారికేడ్లు, ఇనుప కంచెలను ఏర్పాటుచేశారు. సింఘు, టిక్రి సరిహద్దులను మూసివేశారు. ఈ క్రమంలో ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. గురువారం నుంచి బోర్డు పరీక్షలు జరుగనున్న నేపథ్యంలో సీబీఎస్ఈ విద్యార్థులకు అడ్వైజరీ జారీచేసింది. ట్రాఫిక్ ఇబ్బందుల నేపథ్యంలో విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, మెట్రో సర్వీసులను వినియోగించుకోవాలని సూచించింది.
ప్రతిష్ఠంభనను తొలగించేందుకు కేంద్ర మంత్రులు గురువారం చండీగఢ్లో మరోసారి రైతు నేతలతో సమావేశం కానున్నారు. కేంద్రమంత్రులు అర్జున్ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద్రాయ్తో సాయంత్రం ఐదు గంటలకు చర్చలు జరుపునున్నట్టు రైతు నాయకుడు శర్వాణ్ సింగ్ తెలిపారు. కేంద్రానికి రైతు సంఘాలకు మధ్య ఇది మూడో దఫా సమావేశం. ఇప్పటికే రెండు సార్లు చర్చలు జరిపినప్పటికీ పలు అంశాలపై ఏకాభిప్రాయానికి రాలేకపోయారు.