రాయ్పూర్: నదిలో చిక్కుకున్న నలుగురు బాలురను పోలీసులు రక్షించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం కొరియా జిల్లాలోని మనేంద్రగఢ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నలుగురు పిల్లలు నదిలో స్నానం చేస్తుండగా నీటి మట్టం ఒక్కసారిగా పెరిగింది. దీంతో నదిలోని రాయిని పట్టుకుని చాలా సేపు నిరీక్షించారు. చివరకు రెండు గంటల సుదీర్ఘ ఆపరేషన్ తరువాత పోలీసులు వారిని రక్షించారు. నది ఇవతల ఒడ్డు నుంచి అవతలి ఒడ్డు వరకు ఇనుప నిచ్చెనలు వేసి పిల్లలను సురక్షితంగా నది నుంచి బయటకు తీశారు.