తిరువనంతపురం: అసలే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికలు. ఆయనేమో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు. కొంచం కింద మీద అయినా ఓటమి చవిచూడాల్సిందే. ఎన్నికల బరిలో నిలిచిన ఓ వ్యక్తిపేరు, ఆయన పేరు ఒకేలా ఉన్నాయి. గతంలో ఒకసారి అతని వల్లే ఓడిపోయాడు కూడా. గతానుభవం గుర్తొచ్చిందే ఏమో.. ఇసారి అలా జరగకూడదని అనుకున్నాడు. ఆ అభ్యర్ధిని పోటీ నుంచి తప్పుకునేలా చేశాడు. ఎన్నికలు అయిపోయాయి. ఆ విషయం బయటపడింది. దీంతో పోలీసులు పార్టీ అధ్యక్షుడిపై కేసు నమోదుచేశారు. ఇదంతా.. కేరళ బీజేపీ అధ్యక్షుడు కే. సురేంద్రన్కు పేరు తీసుకొచ్చిన చిక్కు.
కేరళ అసెంబ్లీకి రెండు నెలల క్రితం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే. సురేంద్రన్ మంజేశ్వర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. అయితే అచ్చం తన పేరునే పోలిన కే. సురేంద్ర అనే వ్యక్తి కూడా నామినేషన్ దాఖలు చేశాడు. గత అనుభవం గుర్తొచ్చిందో ఏమో.. అతనిని పోటీలో నుంచి తప్పించాలని సురేంద్రన్ నిర్ణయించుకున్నారు. దీంతో అతడిని నయానో బయానో ఒప్పించి మొత్తానికి పోటీ నుంచి తప్పించాడు. బీఎస్పీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సురేంద్ర.. తన ప్రమాణ పత్రాలను ఉపసంహరించుకుని బీజేపీకి మద్దతు ప్రకటించాడు.
అయితే తాజాగా ఈ విషయాన్ని సురేంద్ర బహిర్గంతం చేశాడు. తాను పోటీ నుంచి తప్పుకున్నందుకు బీజేపీ తనకు రూ.2.5 లక్షలు, ఓ మొబైల్ ఫోన్ ఇచ్చిందని ప్రకటించాడు. దీంతో అదే నియోజకవర్గం నుంచి సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసిన వీవీ రమేశన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కోర్టు అనుమతితో కే. సురేంద్రన్పై పోలీసులు కేసు నమోదుచేశారు. సురేంద్ర ప్రకటనపై ప్రాధమిక దర్యాప్తు ప్రారంభించామని వెల్లడించారు.
కాగా, 2016లో జరిగిన ఎన్నికల్లో మంజేశ్వర్ నుంచి కే. సురేంద్ర స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశాడు. ఈ ఎన్నికల్లో కే. సురేంద్రన్ కేవలం 89 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అప్పుడు సురేంద్రకు 467 ఓట్లు వచ్చాయి.