Farmers Protest | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: ఢిల్లీ చలో మార్చ్ సందర్భంగా పోలీసులతో ఘర్షణలో మరణించిన యువరైతు శుభకరణ్ సింగ్ అంతిమ సంస్కారాలపై అన్నదాతలు కీలక ప్రకటన చేశారు. మృతికి బాధ్యులైన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాకే మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తామని తేల్చిచెప్పారు. రైతు మృతికి నిరసనగా శుక్రవారం రైతులు బ్లాక్డే పాటించారు. ఈ క్రమంలో పంజాబ్ సరిహద్దులోని ఖనౌరి వైపు వెళ్తున్న రైతులను నిలువరించడానికి పోలీసులు వారిపై టియర్గ్యాస్ను ప్రయోగించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. మరోవైపు, నిరసనల్లో పాల్గొన్న మరో అన్నదాత అసువులు బాశాడు. పంజాబ్-హర్యానా సరిహద్దుల్లో ఇటీవల పోలీసులు టియర్గ్యాస్ ప్రయోగించడంతో దర్శన్సింగ్ అనే రైతు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం పరిస్థితి విషమించడంతో దవాఖానకు తరలిస్తుండగా గుండెపోటుతో మరణించారు. ఇప్పటివరకు నలుగురు అన్నదాతలు ప్రాణాలు కోల్పోయారు.
రైతుల ఆందోళనలో మృతి చెందిన యువ రైతు శుభకరణ్ సింగ్ కుటుంబానికి కోటి రూపాయల పరిహారం, అతని సోదరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నట్టు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. శుభకరణ్ సింగ్ను అమరవీరునిగా ప్రకటించాలని రైతులు డిమాండ్ చేశారు. మరోవైపు, ఆందోళనలో పాల్గొంటున్న కొంతమంది రైతు నేతలపై జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) అమలు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని శుక్రవారం హర్యానా పోలీసులు ఉపసంహరించుకున్నారు. నిరసనల సందర్భంగా ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసిన అన్నదాతల ఆస్తులను పోలీసులు జప్తు చేస్తున్నారు.
ఢిల్లీ చలో మార్చ్ను ఈ నెల 29 వరకు నిలిపివేస్తున్నట్టు అన్నదాతలు ప్రకటించారు. భవిష్యత్తు కార్యాచరణను 29న ప్రకటిస్తామని తెలిపారు. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించడం సహా పలు డిమాండ్ల సాధన కోసం సంయుక్త కిసాన్ మోర్చా(నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా నిరసన చేపడుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం రైతు నాయకుడు కర్వాన్ సింగ్ పందేర్ మాట్లాడుతూ.. శనివారం కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టనున్నట్టు ప్రకటించారు. 26న కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మలను దహనం చేస్తామని వెల్లడించారు.