న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై ట్విట్టర్ వేదికగా విమర్శల పరంపర కొనసాగిస్తూనే ఉన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ -7.3 శాతంగా నమోదైనట్లు సోమవారం కేంద్ర గణాంక కార్యాలయం (NSO) డాటా విడుదల చేసిన నేపథ్యంలో.. మంగళవారం ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీ స్పందించారు. పీఎం హాల్ ఆఫ్ షేమ్.. కనిష్ఠ జీడీపీ, గరిష్ఠ నిరుద్యోగం అని ట్వీట్ చేశారు.
అంతేగాక, నిరుద్యోగానికి సంబంధించిన ఓ గ్రాఫ్ను కూడా రాహుల్గాంధీ ట్విట్టర్లో షేర్ చేశారు. 2014 నుంచి క్రమంగా నిరుద్యోగం భారీ స్థాయికి పెరిగనట్లు ఆ గ్రాఫ్ తెలియజేస్తున్నది. అంతకుముందు, బ్లాక్ ఫంగస్ వ్యాధిపై రాహుల్ గాంధీ ప్రభుత్వానికి మూడు ప్రశ్నలు సంధించారు. బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్లో వాడే ఆంఫోటెరిసిన్-B ఇంజెక్షన్ల కొరతపై కేంద్రం ఏం చర్యలు తీసుకుంటోందని, పేషెంట్ ఈ మెడిసిన్ పొందాల్సిన పద్ధతులు ఏమిటని, బ్లాక్ ఫంగస్ వ్యాధికి చికిత్స ఇవ్వకుండా నిబంధనల పేరుతో ప్రజలను ఎందుకు అయోమయంలోకి నెట్టేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.