న్యూఢిల్లీ, జూన్ 3: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకొచ్చి, ఆ తర్వాత రద్దు చేసిన వివాదాస్పద రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపిన ప్రముఖ పరిశోధకురాలు, రచయిత, హక్కుల కార్యకర్త డాక్టర్ నవ్శరణ్ సింగ్ను ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ (పీఎంఎల్ఏ) కేసులో ప్రశ్నించడాన్ని దేశంలోని 350 మందికిపైగా విద్యావేత్తలు, పరిశోధకులు, న్యాయనిపుణులు, ఆర్టిస్టులు, పౌర సమాజ సభ్యులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు వారి సంతకంతో కూడిన లేఖను విడుదల చేశారు. డాక్టర్ సింగ్ సభ్యురాలిగా ఉన్న హక్కుల కార్యకర్త హర్ష్ మందిర్ సారథ్యంలోని అమన్ బిరాదరి ట్రస్టు లావాదేవీల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సమన్లు జారీ చేసిన ఈడీ మే 10న ఆమెను సుదీర్ఘంగా ప్రశ్నించింది.
దీనిని తీవ్రంగా పరిగణించిన ప్రముఖులు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈడీ తీరును ఖండిస్తూ.. డాక్టర్ సింగ్ చిత్తశుద్ధి కలిగిన స్కాలర్ అని, వ్యవసాయం, మహిళా హక్కులు, రైతులు, శాంతి రంగాల్లో ప్రసిద్ధ పరిశోధకురాలని పేర్కొన్నారు. అసంఘటిత కార్మికులు, వర్గ హింస తదితర వాటిపై పోరాడుతున్నారని, పేద రైతులు, గిరిజనులు, దళిత మహిళలు, ఇతర నిరుపేద ప్రజలు స్థిర జీవనోపాధి పొందేందుకు ఆమె చేస్తున్న పోరాటం విధానపరమైన దృష్టిని ఆకర్షించిందని పేర్కొన్నారు. పీఎంఎల్ఏను భారత ప్రజాస్వామ్యంలో ఓ మచ్చగా అభివర్ణించారు. రాజ్యాంగ విలువలను సమర్థించిన ప్రముఖులను వేధించడాన్ని ప్రభు త్వం, ఈడీ మానుకోవాలని హితవు పలికారు.