హైదరాబాద్, జులై 16 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వ నయవంచనకు నిరసనగా శనివారం నిరుద్యోగులు, విద్యార్థులతో కలిసి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సరూర్నగర్లో భారీ యువ సంగ్రామ సదస్సు నిర్వహించనున్నట్టు బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ప్రకటించారు. గురువారం తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో కౌశిక్రెడ్డితో పాటు ముఖ్య నేతలు రేవంత్ సరార్పై విమర్శల వర్షం కురిపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, ఉద్యోగాల కల్పన పేరుతో నిరుద్యోగులను నట్టేట ముంచిందని పాడి కౌశిక్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ యువతను నమ్మించి మోసం చేసిందని ఆరోపించారు. ‘బీఆర్ఎస్ హయాంలో 2 లక్షల 32 వేల ఉద్యోగాలు భర్తీ చేయడంతోపాటు 10 లక్షల ప్రైవేటు ఉద్యోగాల కల్పనకు కృషి చేశాం. కానీ, కాంగ్రెస్ ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను పట్టించుకోవడం లేదు’ అని తెలిపారు. మాయామాటలతో విద్యార్థులు, యువతను రెచ్చగొట్టి ఓట్లు వేయించుకొన్న రేవంత్రెడ్డి.. ఇప్పుడు వారిని రోడ్డుపై నిలబెట్టారని మండిపడ్డారు. యువతకు రేవంత్రెడ్డి ప్రభుత్వం చేసిన ద్రోహానికి నిరసనగానే శనివారం సభ నిర్వహించనున్నట్టు తెలిపారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో శనివారం సరూర్నగర్ జరుగనున్న భారీ సదస్సునకు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం ఆటంకాలు కలిగిస్తున్నదని బీఆర్ఎస్ నాయకుడు తలసాని సాయికిరణ్యాదవ్ ఆరోపించారు. సర్కార్ నుంచి అనుమతి రాకుంటే న్యాయస్థానం ద్వారానైనా అనుమతి సాధించుకుంటామని స్పష్టం చేశారు. యువతకు ఇచ్చిన దొంగ హామీలను ఎండగట్టడమే ఈ సభ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. నిరుద్యోగులకు ప్రభుత్వం లక్షా 20 వేల రూపాయల చొప్పున బాకీ పడిందని తేల్చి చెప్పారు. ఈ సభలో నిరుద్యోగ యువత కోసం భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు.
నిరుద్యోగులను నిండా ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వ పతనం మొదలైందని బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జి మన్నె క్రిశాంక్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్, బీఆర్ఎస్ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి పట్లోళ్ల కార్తీక్ రెడ్డి స్పష్టంచేశారు. ఈ యువ సంగ్రామ సదస్సుతో కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తామని స్పష్టం చేశారు. రేవంత్రెడ్డికి ఏడబ్ల్యూఎస్కు, వెబ్ సిరీస్కు తేడా తెలియడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులపై నిత్యం లాఠీచార్జి చేస్తున్నదని, ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో ఇప్పటికీ స్పష్టత లేదని, నిరుద్యోగుల ఉసురు తగిలి ఈ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. సమావేశంలో డాక్టర్ కే వాసుదేవరెడ్డి, కే కిషోర్గౌడ్, దూసరి శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.