న్యూఢిల్లీ: కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. అయితే దేశంలో ఉన్న కోవిడ్ పరిస్థితిపై చర్చించేందుకు ఇవాళ ప్రధాని మోదీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. B.1.1.529 వేరియంట్ ఆందోళనకరంగా ఉన్నట్లు శుక్రవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న విషయం తెలిసిందే. ఆ వేరియంట్లో దాదాపు 50 మ్యుటేషన్లు జరిగినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించనున్నారు. B.1.1.529 వేరియంట్లో ఉన్న స్పైక్ ప్రోటీన్ల 30 సార్లు ఉత్పరివర్తనం చెందినట్లు శాస్త్రవేత్తలు అంటున్నారు. చాలా ప్రమాదకరరీతిలో మ్యుటేషన్లు ఉన్న నేపథ్యంలో ఆ వేరియంట్ వ్యాక్సిన్లు పనిచేస్తాయో లేదో కూడా తెలియదు. డబ్ల్యూహెచ్వో ఈ కొత్త వేరియంట్పై స్టడీ చేయనున్నది.