వారణాసి : కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి వీధుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మోదీకి వారణాసి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. మోదీపై గులాబీ పూలవర్షం కురిపించారు. భారీ జనసందోహం మధ్య మోదీ వీరాభిమాని ఆయనను కలిసేందుకు ఆసక్తి చూపాడు. ఈ విషయాన్ని గమనించిన మోదీ తన కాన్వాయ్ను ఆపారు. అనంతరం సదరు వ్యక్తి మోదీకి తలపాగా(పగిడి), కాషాయ రంగులో ఉన్న కండువాను బహుకరించారు. ఆయనే నేరుగా మోదీ తలపై పగిడి పెట్టి, కండువాను మెడలో వేశారు.
ఇక మోదీ.. మోదీ.. హర హర మహాదేవ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసి.. మోదీపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అయితే మోదీకి తలపాగా బహుకరించిన వ్యక్తిని సెక్యూరిటీ సిబ్బంది పక్కకు నెట్టేసే ప్రయత్నం చేశారు. కానీ మోదీ తన కాన్వాయ్ను ఆపి అతన్ని కలిశారు.