హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): జోషీమఠ్ పట్టణంలో పగుళ్లు ఏర్పడటంతో ఇప్పటికే వందలాది ఇండ్లు, రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిణామాలకు కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలే కారణమని స్థానికులు మండిపడుతున్నారు. కొండచరియలు విరిగిపడగా ఏర్పడిన శిథిలాల మీద జోషీమఠ్ పట్టణాన్ని శతాబ్ధం క్రితం నిర్మించారని నిపుణులు తెలిపారు. అయితే, ఇలాంటి సున్నితమైన ప్రదేశానికి సమీపంలో భారీ ప్రాజెక్టులను ప్రభుత్వం నిర్మిస్తున్నదని స్థానికులు పేర్కొన్నారు. ఇది పట్టణానికి ప్రమాదమని ఎన్ని విజ్ఞప్తులు చేసినా సర్కారు పట్టించుకోలేదని వాపోయారు. ప్రాజెక్టుల కోసం డ్రిల్లింగ్, తవ్వకాలు, బోర్లు వేయడం వల్లే పగుళ్లు ఏర్పడుతున్నట్టు తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం, ఎన్నికల్లో గెలువడానికి.. సర్కారు ఈ విధంగా చేసిందని మండిపడ్డారు. ఎన్టీపీసీ తపోవన్-విష్ణుగాఢ్ హైడల్ ప్రాజెక్టు, హెలాంగ్-మర్వారీ బైపాస్, 66 సొరంగాల నిర్మాణంతో పాటు ఇప్పటికే నిర్మాణం తుది దశకు చేరుకొన్న చార్ధామ్ రోడ్డు ప్రాజెక్టుతో జోషీమఠ్, హిమాలయాల సమీపంలో ఉన్న గ్రామాలకు ముప్పు ఉండొచ్చని ప్రఖ్యాత భూగర్భ శాస్త్రవేత్త డాక్టర్ సీపీ రాజేంద్రన్ అభిప్రాయపడ్డారు. 2017 ఎన్నికలకు ముందు అభివృద్ధి నినాదం పేరిట బీజేపీ ఈ ప్రాజెక్టులను హడావుడిగా ప్రకటించింది. అధికారంలోకి రాగానే, ఎన్జీటీ అభ్యంతరాలను పక్కనబెట్టి మరీ ప్రాజెక్టు పనులను ముమ్మరంగా సాగించడం గమనార్హం.
ఆపేదాకా.. ఆగదు
14 నెలల కిందటే పరిస్థితులను ఉన్నతాధికారులకు వివరించాం. అప్పుడు వాళ్లు పట్టించుకోలేదు. ఇప్పుడు పరిస్థితి చేయిదాటాక, నిపుణులను పంపిస్తే.. లాభమేంటి? ప్రాజెక్టుల నిర్మాణాన్ని శాశ్వతంగా ఆపేంతవరకూ జోషీమఠ్లో వినాశనం ఇలాగే కొనసాగుతుంది.
-జోషీమఠ్ బచావో సంఘర్ష్ సమితి కన్వీనర్ అతుల్ సతీ