న్యూఢిల్లీ : వారణాసిలో కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఓ దివ్యాంగురాలి పాదాలకు మొక్కి కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు. కాశీలో మోదీ పర్యటిస్తున్న సమయంలో దివ్యాంగురాలైన శిఖా రాస్తోగి.. ఆయనను కలిసేందుకు ముందుకు వచ్చింది. ప్రధాని మోదీ ఆశీర్వాదం తీసుకునేందుకు ఆమె ప్రయత్నించగా, మోదీనే ఆమె పాదాలకు మొక్కారు. ఆమె యోగ క్షేమాలను మోదీ అడిగి తెలుసుకున్నారు.
అక్కడే ఉన్న సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా శిఖాకు నమస్కరించి అభినందనలు తెలిపారు. ఈ ఫోటోను బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్ తన ట్విట్టర్లో షేర్ చేసి, ఇది మహిళా శక్తికి గౌరవం అని ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.