న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఘర్షణలను ముగించేందుకు అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహనను ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ప్రధాని మోదీ తన ‘ఎక్స్’ పోస్టులో ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక అంతరాయానికి కారణమై, పలు దేశాలలో ప్రాణ నష్టానికి దారితీసిన పశ్చిమాసియా ఘర్షణలను ముగించేందుకు అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని స్వాగతిస్తున్నాను. ఈ అవగాహన అమలు అయితే ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాల పునరుద్ధరించడం, నౌకాయాన, స్వేచ్ఛా వాణిజ్యానికి భరోసా కల్పిస్తుందని భారతదేశం ఆశిస్తున్నదని పేర్కొన్నారు.
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందంపై ప్రపంచమంతా హర్షం వ్యక్తం చేసింది. ప్రపంచ దేశాలు, నాయకులు స్వాగతించారు. పశ్చిమాసియాలో శాంతి, శాశ్వత ప్రశాంతత దిశగా ఒక ముందడుగు పడిందని పాకిస్థాన్, ఖతార్ ఒప్పందాన్ని ప్రశంసించాయి. చర్చలు ప్రారంభించడాన్ని, మిలిటరీ ఆపరేషన్స్ ఆపేయడాన్ని సౌదీ అరేబియా స్వాగతించింది.
ఒప్పందాన్ని స్వాగతిస్తున్నట్టు కువైట్ తెలిపింది. పాకిస్థాన్ చేపట్టిన మధ్యవర్తిత్వ ప్రయత్నాలను చైనా ప్రశంసించింది. శాంతియుత పరిష్కారం దిశగా ఒక కీలకమైన అడుగు పడిందని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రెటరీ గుటెరస్ అన్నారు. ప్రాంతీయ స్థిరత్వానికి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇది అత్యవసరమని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా అభిప్రాయపడ్డారు.