Stop killing us | న్యూఢిల్లీ, మే 25 (నమస్తే తెలంగాణ) : పాకీ పనిచేస్తూ మరణించిన వారి సంఖ్య వంద దాటిందని, ఇందుకు సిగ్గుపడుతూ ప్రధాని నరేంద్ర మోదీ జాతికి క్షమాపణ చెప్పాలని సఫాయి కర్మచారి ఆందోళన్ సంస్థ డిమాండ్ చేసింది. ‘మమ్నల్ని చంపటం ఆపండి’.. (స్టాప్ కిల్లింగ్ అజ్) పేరిట ఈ సంస్థ ఆందోళన చేపట్టి ఇప్పటికి 380 రోజులు దాటింది. అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఉదాసీన వైఖరిని సంస్థ జాతీయ కన్వీనర్ బెజవాడ విల్సన్ ఎండగట్టారు.
తక్షణమే అమానవీయ వృత్తికి చరమగీతం పాడాలని, ఇలాంటి విషాదకర చావులను ఆపాలని, కులాలవారీ దోపిడీని, అస్పృశ్యతను రూపుమాపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. నిరుడు మే 11న స్టాప్ కిల్లింగ్ అజ్ పేరిట జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని ప్రారంభించి పలు నిరసనలు చేపట్టినట్టు పేర్కొన్నారు. అమానవీయ, విషాదకర చావులు సంభవిస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని ఆరోపించారు. రాజ్యంగం ప్రకారం దేశంలోని ప్రతి పౌరునికి గౌరవంగా జీవించే హక్కు ఉందని, కానీ పాకీ పనిచేసే వారి పట్ల సమాజంలో నేటికీ చిన్న చూపు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పాకీ పనిచేస్తూ ఇప్పటికే వేల మంది మరణించారని చెప్తూ పాకీ పనిని నిషేధిస్తూ చట్టం చేసినప్పటికీ అమలుకు మాత్రం నోచుకోవడం లేదని వాపోయారు.
1993లోనే చట్టం
పాకీ పనిని నిషేధిస్తూ 1993లోనే చట్టం వచ్చింది. రెండు దశాబ్దాలలో 625 మంది జిల్లా కలెక్టర్లలో ఒక్కరంటే ఒక్కరు కూడా చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు చేయలేదు? ఇంతకాలం సఫాయి కర్మచారి ఆయోగీ నివేదికను పార్లమెంట్లో ఎందుకు ప్రవేశపెట్టలేదు? ఈ అనాగరికమైన విధానానికి నిర్ణీత కాల వ్యవధిలో చరమగీతం పాడాలని ఒక్కరంటే ఒక్కరు కూడా ఎందుకు నినదించలేకపోయారు? దీనిపై చర్య తీసుకోవాలని ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి తేవటం లేదు? బెజవాడ విల్సన్ సంధిస్తున్న ప్రశ్నలు ఎంతో సహేతుకమైనవి.
1993లో చట్టం వచ్చినా ఎత్తుడు దొడ్లను కూల్చమని ఇప్పటికీ అధికారుల తలుపులు తడుతున్నామని వెల్లడించారు. ఏ చట్టమూ కూడా తనంతట తాను పనిచేయదు.. దాన్ని ముందుకు తోయటానికి ప్రజాబలం ఎంతో అవసరం అన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మాటలను దృష్టిలో పెట్టుకునే 2003లో సుప్రీంకోర్టును ఆశ్రయించామని, అయినా అక్కడ కూడా తమకు న్యాయం దక్కలేదని వాపోయారు. చనిపోయిన పాకీ పనివారి కుటుంబాలకు పెన్షన్లు ఇవ్వాలి, వారి పిల్లలకు విద్యావకాశాలు కల్పించాలి, గౌరవంగా బతికే, అంటరానితనం లేని జీవితం వారికి కల్పించాలి, ఇకపై ఏ ఒక్కరూ పాకీ పనిచేస్తూ మృత్యువాత పడకూడదు. ఈ చావులన్నీ ప్రభుత్వ హత్యలుగానే భావిస్తున్నాం. అందుకు ప్రధాని క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని విల్సన్ డిమాండ్ చేశారు.
ప్రధాని మోదీది ప్రచార యావ
గత కుంభమేళా సందర్భంగా ప్రధాని మోదీ ఘాట్లను శుభ్రం చేస్తున్న సఫాయి కర్మచారులను చూసి చలించి ఓ ఐదుగురి కాళ్లు కడిగారు. దీంతో తమ సమస్య ప్రధానికి అర్థమైందని, ఇక తమ కష్టాలు గట్టెక్కుతాయని అంతా భావించారు. కానీ వారి ఆశలు అడియాసలయ్యాయి. అదంతా ప్రచారార్భాటమని తేలిపోయింది. కాళ్లు కడిగించుకున్న సఫాయి కర్మచారులైతే ఇక తాము ఈ అమానవీయ వృత్తి నుంచి బయటపడినట్టేనని సంబరపడ్డారు. పర్మనెంట్ కొలువులు వస్తాయని ఆశించారు. అదంతా ఒట్టి భ్రమ అని వారికి కూడా అర్థమైపోయింది. రాఫెల్ విమానాలు, బుల్లెట్ రైళ్ల గురించి నిరంతరం చెప్తారు కానీ, మురుగకాల్వలను శుభ్రం చేసే యంత్రాల గురించి మాత్రం చెప్పరు. మురుగునీటి కార్మికుల జీవితాలను బాగు పరిచే చర్య ఒక్కటి కూడా మోదీ సర్కార్ తీసుకోకపోవడం విచారకరం. మాన్యువల్ స్కావెంజర్ల వ్యవస్థను రూపుమాపాలని 40 ఏండ్లుగా అవిశ్రాంతంగా పోరాడుతున్నామని, ఇకనైనా పాకీ పనిచేస్తూ చనిపోయే దురవస్థను తప్పించాలని బెజవాడ విల్సన్ కోరారు.