2014 ఎన్నికల్లో ప్రధాని మోదీపై వారణాసి నుంచి పోటీ చేసినట్లుగా.. ఈ సారి కూడా పోటీ చేస్తారా? అన్న ప్రశ్నకు ఆప్ అధినేత, సీఎం కేజ్రీవాల్ ఆసక్తికర సమాధానమిచ్చారు. అప్పటి పరిస్థితులు వేరని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎలా ఢీకొనాలో ఆలోచించాల్సి వుంటుందని పేర్కొన్నారు. ఓ జాతీయ ఛానల్కిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కేజ్రీవాల్ పై విధంగా స్పందించారు. ఎన్నికల్లో బీజేపీని ఓడించాలన్నది తమ అభిమతం ఎంత మాత్రమూ కాదని, కేవలం సుపరిపాలన, వ్యవస్థల మార్పే తమ ఏకైక అజెండా అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అయితే.. పంజాబ్ ఎన్నికల్లో వచ్చిన తీర్పు తాము ఊహించలేదని, ఊహించిన దానికంటే ఎక్కువగానే వచ్చిందని కేజ్రీవాల్ సంతృప్తి వ్యక్తం చేశారు.
గుజరాత్, హిమచల్ రాష్ట్రాల్లో తాము కొత్తగా అడుగులు వేస్తున్నామని, అయితే.. అక్కడి ప్రజలు మాత్రం తమ పార్టీ వైపు ఎంతో ఆశాజనకంగా ఎదిరిచూస్తున్నారని అన్నారు. మరోపక్క కశ్మీర్ ఫైల్స్ సినిమాపై తాను చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతలు తమ ఇంటిపై చేసింది దాడి కాదని.. అది గూండాయిజం అని కేజ్రీవాల్ మండిపడ్డారు. హింసాత్మక రాజకీయాలకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ వాళ్లు దాడి చేసే సమయంలో ఇంట్లో తమ తల్లిదండ్రులు మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు.