భారత్ నుంచి 150 మంది వరకు ఐసిస్లో చేరారని అమెరికన్ ప్రభుత్వం చెప్తున్న మాట. 250మంది వరకు చేరి ఉండొచ్చునని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. కానీ ఒక్క కేరళ రాష్ట్రం నుంచే 32,000మంది లవ్జిహాద్ కారణంగా ఐసిస్లో చేరారని పేర్కొంటూ ‘ది కేరళ స్టోరీ’ పేరిట కొందరు ఓ సినిమాను వండారు. అదే కట్టుకథను చిత్ర ప్రచారానికీ వాడుకున్నారు. పౌరసమాజం, కేరళ ప్రభుత్వం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తంకావడంతో విడుదలకు ముందే చిత్రబృందం మాటమార్చింది. కేరళ స్టోరీ కాదని, కేవలం ముగ్గురి స్టోరీ మాత్రమేనని ప్రకటించాల్సి వచ్చింది.
ఇప్పుడు అలాంటి వివాదాస్పద సినిమాను ఏకంగా ప్రధానమంత్రే ప్రమోట్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ లెక్కలు అబద్ధమని తేలుస్తున్నా.. ఆ సినిమా కథ నిజమైనదేనంటూ అధికారిక హోదా నుంచి మోదీ నమ్మబలుకుతున్నారు. వ్యక్తిగతంగా మద్దతివ్వడమే కాకుండా.. ఆ సినిమాను చూడాల్సిందిగా ప్రజలకు ఆయన బహిరంగంగా పిలుపునిస్తున్నారు. సినిమా ముసుగేసి తెర మీద విషం, విద్వేషం చిమ్మేదొకరు.. తెరవెనుక ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టి రీల్ రీలుకూ ఓట్లు పిండుకునేదొకరు. ఇదే నేటి రాజకీయం! ఇదేమి దౌర్భాగ్యం!
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకొన్న బీజేపీ.. తనదైన విద్వేష కుతంత్రాలకు తెరలేపింది. బీజేపీకి ఓటమి తప్పదని పలు మీడియా, ఇతర సంస్థల సర్వేలు తేల్చడంతో.. ఎలాగైనా గట్టెక్కేందుకు తన ఒరలోని ‘విద్వేష’ కత్తిని బయటకు తీసింది. ఇప్పటికే ‘భజరంగ్ బలి’ని కాంగ్రెస్ నిషేధిస్తానన్నది అంటూ ఎన్నికల ప్రచార సభల్లో గగ్గోలు పెడుతున్న ప్రధాని మోదీ, బీజేపీ నేతలు.. తాజాగా దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన ‘ది కేరళ స్టోరీ’ చిత్రాన్ని ప్రమోట్ చేసే పనిని భూజానికెత్తుకొన్నారు. శుక్రవారం బళ్లారిలో నిర్వహించిన సభలో ప్రధాని మోదీ స్వయంగా ఈ సినిమాను ప్రస్తావించి విద్వేష మంటలను మరింతగా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. సినిమాకు మద్దతు పలికిన ఆయన.. సినిమా తీసిన నిర్మాతలను ప్రశంసిస్తూ మాట్లాడారు.
PM Modi | బళ్లారి/తిరువనంతపురం, మే 3: అనేక వివాదాల నడుమ లవ్జిహాద్ ఇతివృత్తం పేరుతో తెరకెక్కిన ‘ది కేరళ స్టోరీ’ శుక్రవారం కేరళతో పాటు దేశవ్యాప్తంగా విడుదల అయింది. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం బళ్లారిలో నిర్వహించిన ప్రచార సభలో ప్రధాని మోదీ వివాదాల చట్రంలో చిక్కుకొన్న ఈ సినిమాను ప్రస్తావిస్తూ ప్రమోట్ చేసే ప్రయత్నం చేశారు. చిత్రం గురించి గొప్పగా చెబుతూ, సినిమా తీసిన నిర్మాతలను ప్రశంసించారు. కేరళలో ఉగ్ర కుట్ర ఆధారంగా ఈ సినిమాను నిర్మించారని, సమాజంలో ప్రధానంగా కేరళ వంటి రాష్ట్రంలో ఉగ్రవాద పర్యావసానాలు, ఉగ్ర కుట్రలతో పాటు వాస్తవాలను బహిర్గతం చేసేందుకు కేరళ స్టోరీ సినిమా ప్రయత్నం చేసిందని అన్నారు. ‘జై భజరంగ్ బలి’ అని నినదించడం నచ్చని కాంగ్రెస్.. కేరళ స్టోరీ సినిమాను నిషేధించాలని డిమాండ్ చేస్తూ, ఉగ్రవాదులకు మద్దతు పలుకడం దురదృష్టకరమని ఈ సందర్భంగా విమర్శలు చేశారు.
కేరళ స్టోరీ సినిమాను అడ్డు పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ చూస్తున్నది. ఇందుకు కేరళతో పాటు పలు ఇతర రాష్ర్టాల్లో బీజేపీ నేతలు సినిమా ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. తాము కూడా స్పెషల్ షోలు వేయిస్తామని మరికొందరు ప్రకటనలు చేస్తున్నారు. కేరళలో తిరువనంతపురంలోని ఓ థియేటర్లో బీజేపీ సాంస్కృతిక ఫోరం ‘తపస్య’ శుక్రవారం ఉదయం సినిమా ప్రత్యేక ప్రదర్శన వేయించింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కూడా బీజేపీ నేత దీపక్ జైన్ ఆధ్వర్యంలో స్పెషల్ షో వేశారు. ఈ సినిమాను విద్యార్థినులు, మహిళలు అందరూ చూడాలని అన్నారు. మధ్యప్రదేశ్లో ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 100 మంది బాలికలకు ఈ సినిమాను ఉచితంగా చూపిస్తానని పేర్కొన్న ఉత్తరప్రదేశ్కు చెందిన బీజేపీ నేత.. ఇతర నేతలు కూడా ఆ పని చేయాలంటూ పిలుపునిచ్చారు.
‘ది కేరళ స్టోరీ’ సినిమాను వ్యతిరేకిస్తూ కేరళ, తమిళనాడులో ఆందోళనలు జరిగాయి. సీపీఎం, ఎన్సీపీ ఇతర పార్టీల యువజన విభాగాలు కొచ్చి, కొజికోడ్తో పాటు పలు పట్టణాల్లోని సినిమా థియేటర్ల ముందు నిరసన ప్రదర్శలు నిర్వహించాయి. ఇరు రాష్ర్టాల్లో వందల సంఖ్యలో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి ఇతర ప్రాంతాలకు తరలించారు. ఆందోళనల నేపథ్యంలో చెన్నైలోని కొన్ని థియేటర్ల యాజమాన్యాలు సినిమాను ప్రదర్శించలేదు. ఈ మేరకు యాజమాన్యాలు ముందుస్తుగా నిర్ణయం తీసుకొన్నాయి. కాగా, సినిమా విడుదలపై స్టే విధించేందుకు కేరళ హైకోర్టు నిరాకరించింది.
సంఘ్పరివార్ విభజన ఎజెండాలో భాగంగా దేశంలో విద్వేష అగ్గిని రగిల్చేందుకు ఈ సినిమాను తీసుకొచ్చారని సీపీఎం అనుబంధ డీవైఎఫ్ఐ మండిపడింది. సంఘ్ పరివార్ శక్తుల విద్వేష ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కేరళలో పెద్దయెత్తున సోషల్ మీడియా క్యాంపెయిన్ను ప్రారంభించనున్నట్టు తెలిపింది. ‘రియల్ కేరళ స్టోరీ’ గురించి దేశంతో పాటు ప్రపంచానికి చెబుతామని డీవైఎఫ్ఐ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ ఏఏ రహీం కోరారు. ముస్లింలను ఉగ్రవాదులుగా చూపేలా ఉన్న సినిమాను నిషేధించాలని, ఇటువంటి కుట్రలను మానుకోవాలని తమిళనాడు ముస్లిం మున్నేట్ర కజగం డిమాండ్ చేసింది. ప్రజల మధ్య విద్వేషం, ఉద్రిక్తతలు రెచ్చగొట్టే దుష్ట పన్నాగంతో ఈ సినిమా తీశారని టీఎంఎంకే నేత ఎంహెచ్ జవహిరుల్లా అన్నారు.