ఖలీల్వాడి/నిజామాబాద్ రూరల్, జూలై 7 : పట్టణ ప్రగతిలో భాగంగా నిజామాబాద్ నగరంలోని గౌతమ్నగర్ ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయం వద్ద అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని కాలనీలు పచ్చదనంతో కళకళలాడాలని అన్నారు. అనంతరం స్థానికులకు మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూకిరణ్, 40 డివిజన్ కార్పొరేటర్ శివచరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జితేశ్ వీ పాటిల్, చంద్రకళ, సాయిరామ్ తదితరులు పాల్గ్గొన్నారు. మూడో డివిజన్ పరిధిలోని గూపన్పల్లిలో రోడ్లకు ఇరువైపులా 600 మొక్కలు నాటారు. స్థానిక కార్పొరేటర్ చిటికెల శ్రీనివాస్రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించి ఉత్తర తిరుపతిక్షేత్రానికి వెళ్లే రోడ్డు పక్కన మొక్కను నాటారు. కార్యక్రమంలో ఉత్తర తిరుపతి క్షేత్రం ఆలయ ఇంజినీర్, రిటైర్డ్ డీఈ జలంధర్, ఆలయ సిబ్బంది, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.
చురుగ్గా పట్టణ ప్రగతి..
ఆర్మూర్, జూలై 7: ఆర్మూర్ పట్టణంలో ‘పట్టణప్రగతి’ పనులు మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినిత, కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ పర్యవేక్షణలో చురుగ్గా కొనసాగుతున్నాయి. పట్టణంలోని 2వ వార్డులో కౌన్సిలర్ సంగీత రోడ్డుకు ఇరువైపులా మొరం వేయించి పొక్లెయినర్తో చదును చేయించారు. 32వ వార్డులో మున్సిపల్ సిబ్బందితో మురుగు కాలువలను స్థానిక కౌన్సిలర్ జనార్దన్రాజ్ శుభ్రం చేయించారు. 4వ వార్డులో కౌన్సిలర్ లత మొక్కలు నాటి నీరు పోశారు. వీరితోపాటు మున్సిపల్ కౌన్సిలర్లు గంగామోహన్ చక్రు, రమేశ్, హన్మాండ్లు, మీనా, వరలక్ష్మి, మురళీధర్రెడ్డి, లావణ్య, సంగీ త, రాము, సుజాత ఆయా వార్డుల్లో పట్టణ ప్రగతి పనుల ను, హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాలను పర్యవేక్షించారు.
పరిసరాలు శుభ్రంగా ఉంచాలి
భీమ్గల్, జూలై 7: పరిసరాలను శుభ్రంగా ఉంచాలని భీమ్గల్ మున్సిపల్ చైర్పర్సన్ మల్లెల రాజశ్రీ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 11వ వార్డులో మున్సిపల్ కమిషనర్ గంగాధర్తో కలిసి బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులో చైర్పర్సన్ కలియతిరుగుతూ కాలనీ వాసులతో మాట్లాడారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కాలనీవాసులకు సూచించారు. కాలనీలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించాలని అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంతో పట్టణంలో చాలా సమస్యలు తీరాయని తెలిపారు. కౌన్సిలర్ షమీంబేగం, విద్యుత్ అధికారులు, మెప్మా సిబ్బంది, కాలనీ వాసులు పాల్గొన్నారు.
జోరుగా అవెన్యూ ప్లాంటేషన్..
బోధన్, జూలై 7: బోధన్ పట్టణ శివారులో బోధన్ – నిజామాబాద్ ప్రధాన రహదారి, బైపాస్ రోడ్లు పక్కన ‘హరితహారం’ అవెన్యూ ప్లాంటేషన్ కింద మొక్కలు నాటే పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రధాన రహదారుల కింద మూడు వరుసల్లో మొక్కలు నాటేందుకు ఉద్దేశించిన అవెన్యూ ప్లాంటేషన్ పనులను బుధవారం బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మావతి పర్యవేక్షించారు. పట్టణంలో రాకాసీపేట్లో ప్రధాన రోడ్ల పక్కన మొక్కలు నాటే స్థలాన్ని ఆమె పరిశీలించారు. కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ రామలింగం, కౌన్సిలర్ తూము శరత్రెడ్డి పాల్గొన్నారు.