న్యూఢిల్లీ, అక్టోబర్ 18: రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గుజరాత్కు ప్రధాని నరేంద్రమోదీ నిధుల వరద పారిస్తున్నారు. గత ఆరు నెలల్లో స్వరాష్ట్రంలో ఏకంగా రూ.90 వేల కోట్ల ప్రాజెక్టులు ప్రారంభించిన మోదీ, తాజాగా బుధవారం మరో రూ.15,670 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా బుధవారం గాంధీనగర్లో ‘డెఫ్ఎక్స్పో-22’ పేరుతో రక్షణ రంగ ఎగ్జిబిషన్ను ప్రారంభిస్తారని ప్రధాని కార్యాలయం మంగళవారం తెలిపింది. దేశీయ ఉత్పత్తిదారులకు ఉద్దేశించిన ఈ ఎక్స్పో దేశంలోనే అతిపెద్దదని వెల్లడించింది. ఈ ఎగ్జిబిషన్లో దేశీయంగా అభివృద్ధి చేసిన హెచ్టీటీ-40 రకం శిక్షణ విమానాన్ని ప్రధాని ఆవిష్కరిస్తారని పేర్కొన్నది. దీనిని ప్రభుత్వరంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) తయారుచేసింది. గగనతల కార్యకలాపాలకు సంబంధించి త్రివిధ దళాలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో రూపొందించిన ‘మిషన్ డెఫ్స్పేస్’ను కూడా ప్రధాని ప్రారంభిస్తారని తెలిపింది. కాగా, హిమాచల్తోపాటుగా గుజరాత్ అసెంబ్లీకి ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడానికి మోదీ పర్యటనే కారణమన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికల ముందర కొత్త ప్రాజెక్టులు ప్రకటించేందుకు వీలుగా ఎన్నికల కోడ్ అడ్డురాకుండా నోటిఫికేషన్ వాయిదా వేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నవేళ.. ప్రధాని మోదీ ఢిల్లీలోకంటే స్వరాష్ట్రంలోనే ఎక్కువ కనిపిస్తున్నారు. వారంలో ఒకటిరెండు రోజులు గుజరాత్లో పర్యటిస్తూ అనేక ప్రాజెక్టులను, అభివృద్ధి పథకాలను ప్రారంభిస్తున్నారు. దీనిపై రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ వ్యంగాస్ర్తాలు సంధించారు. గుజరాత్లో ప్రధాని కార్యాలయం (పీఎంవో) బ్రాంచ్ని తెరువాలని ప్రధానికి సూచించారు. ఉత్తరప్రదేశ్లో గెలిచిన మరుసటి రోజు నుంచే ప్రధాని గుజరాత్లో పర్యటించటం ప్రారంభించారని విమర్శించారు.