కామారెడ్డి రూరల్, మార్చి 23: కలెక్టర్ నుంచి పంచాయతీ కార్యదర్శి వరకూ ప్రతి ఒక్క ఉద్యోగి తమ బాధ్యతలను అంకితభావంతో, బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని కలెక్టర్ శరత్ అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎవరు నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. కామారెడ్డి మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం వివిధ శాఖల మండలాధికారులతో సమీక్షను నిర్వహించారు. గ్రామాల్లో రైతు కల్లాల నిర్మాణాలను వేగవంతం చేయాలని వ్యవసాయ, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. నాలుగు నెలలకు సరిపడా ఉపాధి పనులను గుర్తించాలన్నారు. ట్యాంకర్ ద్వారా మొక్కలకు నీరు పట్టాలని, ప్రతి రోజూ చెత్తను ట్రాక్టర్ ద్వారా సేకరించాలని, ఒక్క మొక్క చనిపోయినా పంచాయతీ కార్యదర్శులదే బాధ్యత అన్నారు. వైకుంఠధామాల నిర్మాణాన్ని నెలాఖరు వరకు పూర్తి చేయాలని, కంపోస్ట్ షెడ్డులను వాడకంలోకి తేవాలని ఆదేశించారు. షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులకు సంబంధించిన పనులను పూర్తి చేయాలని, కరోనా టీకాల పంపిణీపై విస్తృతంగా ప్రచారం చేయాలని, పల్లెప్రగతిలో మిగిలిపోయిన విద్యుత్ పనులను పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పాఠశాలల్లో విద్యుర్థులు, ఉపాధ్యాయులు కొవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలన్నారు. అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, డీఆర్డీవో చంద్రమోహన్రెడ్డి, ఆర్డీవో శ్రీనునాయక్, జడ్పీటీసీ చిదుర రమాదేవి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.